16 ఏళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత ఆ దేశంలో పర్యటించనున్న ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు
By: Sankar Wed, 18 Nov 2020 10:04 PM
16 ఏండ్ల సుదీర్ఘ సమయం తరువాత ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు పాకిస్థాన్లో పర్యటించనుంది. ఈ మేరకు మంగళవారం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి టోమ్ హరిసన్ జట్టు పర్యటనను ఖరారు చేశారు. 2021, అక్టోబర్లో భారత్లో జరిగే టీ20 పురుషుల ప్రపంచ కప్కు ముందు ఇంగ్లాండ్ జట్టు పాకిస్థాన్లో పర్యటించనుంది. అక్టోబర్ 12న ఇంగ్లాండ్ జట్టు పాకిస్థాన్కు చేరుకొని కరాచీలో 14,15 వ తేదీల్లో రెండు టీ20 మ్యాచ్లు ఆడునుంది.
అటు నుంచి ఇరుజట్లు అక్టోబర్ 16న భారత్కు చేరుకుంటాయని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. గత నెల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇంగ్లాండ్ జట్టును తమ దేశంలో పర్యటించాలని ఆహ్వానించింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఇంగ్లాండ్ బోర్డు పర్యటనను ఖరారు చేసింది.
ఇంగ్లాండ్ జట్టు చివరిసారిగా 2005లో పాకిస్థాన్లో పర్యటించి మూడు టెస్టులు, ఐదు వన్డేలు ఆడింది. ఆ తరువాత 2012, 2015లో ఇరు జట్లు యూఏఈలో తాత్కాలిక వేదికపై తలపడ్డాయి. ఇంగ్లాండ్ జట్టు పర్యాటన ఖరారు కావడంపై పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వసీమ్ ఖాన్ సంతోషం వ్యక్తం చేశారు