విండీస్ తో మూడో టెస్ట్ .. తొలి ఇన్నింగ్స్లో 369 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్
By: Sankar Sat, 25 July 2020 5:53 PM
వెస్టిండీస్తో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆతిథ్య ఇంగ్లాండ్ భారీ స్కోరు సాధించింది. ఓలీ పోప్(91), జోస్ బట్లర్(67), రోరీ బర్న్స్(57), స్టవర్ట్ బ్రాడ్(62) అర్ధశతకాలతో విజృంభించడంతో ఇంగ్లాండ్ పటిష్టస్థితిలో నిలిచింది. ఇన్నింగ్స్ ఆఖర్లో బ్రాడ్ ధనాధన్ బ్యాటింగ్తో కేవలం 45 బంతుల్లోనే 9ఫోర్లు, సిక్సర్తో చెలరేగి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 2017 తర్వాత బ్రాడ్కు ఇదే తొలి హాఫ్సెంచరీ కావడం విశేషం.
బ్రాడ్ దూకుడుగా ఆడటంతో అలవోకగా 350 పరుగుల మార్క్ను చేరుకున్నది. తొలి ఇన్నింగ్స్లో 111.5 ఓవర్లు ఆడిన ఇంగ్లాండ్ 369 పరుగులకు ఆలౌట్ అయింది. విండీస్ బౌలర్లలో కీమర్ రోచ్(4/72) ఆతిథ్య బ్యాట్స్మెన్ను బాగా ఇబ్బందిపెట్టాడు. షానన్ గాబ్రియెల్, రోస్టన్ ఛేజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
ఈ సిరీస్ లో ఇప్పటికే రెండు టెస్టులు జరగగా మొదటి టెస్టులో వెస్ట్ ఇండీస్ , రెండో టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించాయి దీనితో మూడో టెస్ట్ ఇరు జట్లకు కీలకంగా మారింది ..కరోనా లాక్ డౌన్ తర్వాత జరుగుతున్న తొలి క్రికెట్ సిరీస్ కావడంతో అందరి కళ్ళు దీనిమీదనే ఉన్నాయి ..