ఈతకు వెళ్లి యువకుడు గల్లంతు ..కన్నీరుమున్నీరు అయిన తల్లి
By: Sankar Sat, 25 July 2020 2:47 PM
ఈతకు వెళ్లిన యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. మదనపల్లె మండలంలో శుక్రవారం సరదాగా ఈతకు వెళ్లిన మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థి నీటిలో గల్లంతయ్యాడు. కొండామారిపల్లెకు చెందిన బైలు గంగిరెడ్డి, సుజాతమ్మ దంపతుల పెద్ద కుమారుడు మణికంఠ అంగళ్లులోని ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చువుతున్నాడు. అతను అదే గ్రామానికి చెందిన స్నేహితులు గణజగదీశ్వర్, కిరణ్ సాయితో కలిసి శుక్రవారం గ్రామ సమీపంలోని బసినికొండ బైపాసు రోడ్డులో ఉన్న స్వామి చెరువుకు ఈతకు వెళ్లారు.
ఈత కొట్టే క్రమంలో మణికంఠ లోతుగా ఉన్న నీటిలోకి వెళ్లాడు తిరిగి ఒడ్డుకు రాలేకపోయాడు. స్నేహితులు చూస్తుండగానే మునిగిపోయాడు. వారు గ్రామస్తులకు సమాచారం అందించి చెరువులో గాలించినా ఆచూకీ లభించలేదు. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది చెరువు వద్దకు చేరుకొని మణికంఠ గురించి తీవ్రంగా గాలించారు.
అయితే ఇంతవరకూ మణికంఠ ఆచూకీ దొరకలేదు. శనివారం మరోసారి మళ్లీ గాలిస్తామని అధికారులు తెలిపారు. సంఘటనా స్థలం వద్దకు రూరల్ ఏఎస్ఐ మహదేవనాయక్ తదితరులు చేరుకుని ఘటనపై మణికంఠ స్నేహితులను ఆరాతీశారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.ఇంజినీర్ అయి తమను అండగా ఉంటాడనుకున్న బిడ్డ కళ్లెదుటే చనిపోవడంతో అతని తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తొంది.