ఆందోళనకరంగా మారుతున్న ఏలూరు పరిస్థితులు...
By: chandrasekar Mon, 07 Dec 2020 1:38 PM
పశ్చిమగోదావరి జిల్లా
ఏలూరులోని దక్షిణ వీధి, తూర్పు వీధి, పడమర వీధి, అశోక్ నగర్, అరుంధతి పేటతో పాటూ మరికొన్ని ప్రాంతాల్లో వందలాది
మంది ప్రజలు ఆకస్మికంగా కళ్లు తిరిగి పడిపోవడం, నురగలు కక్కుతూ పడిపోవడం, వాంతులు, తలపోటుతో
బాధపడుతున్నారు. బాధితుల్ని హుటా హుటిన ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు.
తాజాగా, ఏలూరు
ఆస్పత్రిలో ఓ బాధితుడు చికిత్స పొందుతూ మరణించారు. ఇదిలా ఉంటే బాధితుల్లో కొంతమంది
తమ రోజువారీ పనులు చేసుకుంటూనే కుప్పకూలిపోయారు. తాజాగా దీనికి సంబంధించి ఓ సీసీ
కెమెరా వీడియో బయటపడింది. ఓ వ్యక్తి తన షాపులో పనిచేసుకుంటున్నాడు.. ఉన్నట్టుండి
అతడు ఫిడ్స్ వచ్చి కిందపడిపోయాడు. వెంటనే గమనించి తోటి వర్కర్లు అతడ్ని ఆస్పత్రికి
తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్లో రికార్డైంది.
ఈ వింత వ్యాధికి గురై
ప్రజలు పిట్టల్లా రాలడానికి కారణం ఏంటనేది ఇంత వరకు అంతు చిక్కడం లేదు. డాక్టర్లు
కూడా ఎందువల్ల ఈ పరిస్థితి తలెత్తిందో చెప్పలేక పోతున్నారు. ఇప్పటి వరకు 292 మంది
బాధితులు ఆస్పత్రుల్లో చేరారు. ఆస్పత్రిలో ఉన్న రోగులు భయాందోళనకు గురవుతున్నారు.ఈ
ఘటనపై వెంటనే స్పందించిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని.. హుటాహుటిన అంబులెన్స్లను
పడమరవీధికి పంపించారు. అలాగే అక్కడే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
ప్రజలకు ఎలాంటి ప్రాణాపాయం లేదని చెబుతున్నారు. ప్రజల అనారోగ్యానికి మాస్
హిస్టీరియా కారణంగానే ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారనే వార్తలు చక్కర్లు
కొడుతున్నాయి. అధికారులు బాధితుల్ని శాంపిల్స్ సేకరించి టెస్టుల కోసం పంపించారు.
ఇటు ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ స్పందించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను కేంద్ర హోం
శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆరా తీశారు.