కరోనా నేపథ్యంలో వాళ్లకు కూడా పోస్టల్ బ్యాలెట్ అవకాశం
By: Sankar Thu, 02 July 2020 7:32 PM
కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించింది. అంతేకాకుండా కోవిడ్ బాధితులు, స్వీయ నిర్బంధంలో ఉన్నవారికి సైతం ఈ అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గురువారం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది.
ఈ ఏడాది చివరిలో బిహార్ సహా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత కరోనా కాలంలో ఓటర్లు పెద్ద ఎత్తున లైన్లో నిలుచోవడం కరోనా వ్యాప్తి కారణమవుతుందని ఈ సందర్భంగా సీఈసీ అభిప్రాయపడింది.
ఇప్పటి వరకు ఎన్నికల విధులు నిర్వహించే పరిపాలన సిబ్బంది, పోలీసులు విదేశాల్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మరికొంత మంది సిబ్బందికి కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసుకునే వీలుంది. కేంద్ర ఎన్నికల సంఘం తాజా నిర్ణయంతో 65 ఏళ్లుపైబడిన ప్రతి ఒక్కరు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది.