క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఎనిమిది మంది అరెస్ట్
By: Sankar Sun, 18 Oct 2020 3:53 PM
ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఎనిమిది మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఖమ్మం నగరంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో టాస్క్ ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు ఆధ్వర్యంలో సీఐ వెంకటస్వామి, ఎస్ఐ ప్రసాద్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు.
ఖమ్మం వన్ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని నిజాంపేట్ సమీపంలో బోయిన సందీప్ మరో ఏడుగురుతో కలిసి ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ పట్టుబడ్డారు. ఈ ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని వీరి నుంచి రూ .15000 నగదు, ఎనిమిది సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో పదిమంది పరారీలో ఉన్నట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ తెలిపారు.
ఈ ఐపీఎల్ సీజన్లో బెట్టింగ్కు సంబంధించి రూ.3,58,000 నగదు ఆఫ్లైన్, ఆన్లైన్, గూగుల్ పే, ఫోన్పే ద్వారా లావాదేవీలు కొనసాగించారని పోలీసుల విచారణలో తెలిసింది. వీరిపై చట్టపరమైన చర్యల నిమిత్తం ఖమ్మం వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో అప్పగించినట్లు ఏసీపీ తెలిపారు. దాడుల్లో కానిస్టేబుల్ రామారావు, సూర్యనారాయణ, కళింగ రెడ్డి పాల్గొన్నారు.