Advertisement

  • ఆంధ్రప్రదేశ్‌లో తెరుచుకోనున్న విద్యాసంస్థలు...నిబంధనలు తప్పనిసరి

ఆంధ్రప్రదేశ్‌లో తెరుచుకోనున్న విద్యాసంస్థలు...నిబంధనలు తప్పనిసరి

By: chandrasekar Mon, 21 Sept 2020 1:02 PM

ఆంధ్రప్రదేశ్‌లో  తెరుచుకోనున్న విద్యాసంస్థలు...నిబంధనలు తప్పనిసరి


ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు ఏడు నెలల తర్వాత విద్యా సంస్థలు ఈ రోజు నుంచి తెరుచుకోనున్నాయి. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా విద్యా సంస్థలను మార్చిలోనే మూసివేసిన విషయం తెలిసిందే. తాజాగా, పాఠశాలలు, కాలేజీల పునఃప్రారంభానికి కేంద్రం మార్గదర్శకాలను జారీచేయడంతో కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యా సంస్థలు తెరవడానికి ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం తయారై౦ది. కంటెయిన్‌మెంట్‌ జోన్లకు వెలుపల ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు విద్యా సంస్థలను మాత్రమే తెరవనున్నారు. మొదటి రోజు ఉపాధ్యాయులందరూ విధులకు హాజరుకావాల్సి ఉంటుంది.

సెప్టెంబరు 22 నుంచి ఆన్‌లైన్‌ టీచింగ్, టెలీ కౌన్సెలింగ్‌, విద్యా వారధి తదితర కార్యక్రమాల కోసం సగం మంది ఉపాధ్యాయులు విధులకు హాజరవుతారు. 9 నుంచి ఇంటర్‌ వరకు చదివే విద్యార్థులు తల్లిదండ్రుల అనుమతితో పాఠశాలలు, కాలేజీలకు పోవచ్చు. అయితే, ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలకు అనుమతించరాదు. రెసిడెన్షియల్‌, కస్తూర్బాగాంధీ విద్యాలయాలు, సంక్షేమ వసతి గృహాల్లో చదివే విద్యార్థులకు వాట్సప్‌ గ్రూపు ద్వారా ఆన్‌లైన్‌లో మార్గనిర్దేశం చేస్తారు. వీరు కావాలనుకుంటే సమీపంలోని ఉన్నత పాఠశాలకు వెళ్లి, ఉపాధ్యాయుల సూచనలు, మార్గదర్శకాలు తీసుకోవచ్చు. విద్యావారధి, విద్యామృతం వంటి కార్యక్రమాలు అక్టోబరు 5వరకు కొనసాగుతాయి.

ఒకటి నుంచి 8 తరగతుల విద్యార్థులకు తల్లిదండ్రుల ద్వారానే మార్గదర్శనం చేయాల్సి ఉంటుంది. వీరికి ఆన్‌లైన్‌, వీడియో పాఠాలే కొనసాగుతాయి. ఇందుకు సంబంధించి వర్క్‌షీట్లను అభ్యాస యాప్‌లో అందుబాటులో ఉంచారు. వాటిని డౌన్‌లోడ్‌ చేసుకొని అభ్యాస౦ కొనసాగించేలా ఉపాధ్యాయులు గైడెన్స్ ఇవ్వాలి. తొమ్మిది, ఆపై తరగతుల విద్యార్థులను మాత్రమే సందేహాల నివృత్తికి విద్యా సంస్థలకు అనుమతించాలి. ఇందుకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. విద్యార్థుల మధ్య ఆరు అడుగుల దూరం తప్పక పాటించాలి. బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, వాటర్ బాటిళ్లను పరస్పరం మార్చుకోకుండా ప్రత్యేక పర్యవేక్షణ జరగాలి.

ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఆన్‌లైన్‌ బోధన, విద్యా వారధి కార్యక్రమం కోసం రోజుకు 22-50 శాతం ఉపాధ్యాయులు హాజరు కావాలి. తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. చేతులను తరుచూ సబ్బుతో కడుక్కోవాలి. శానిటైజర్‌ను అందుబాటులో ఉంచుకోవాలి. ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. పాఠశాల ప్రాంగణంలో ఉమ్మివేయడం నిషేధం. అవకాశం ఉన్న వారు ఆరోగ్య సేతు యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. పంచాయతీరాజ్‌, పురపాలక విభాగాలను సంప్రదించి ప్రధానోపాధ్యాయులు పాఠశాల పరిసరాలను శానిటైజ్‌ చేయించాలి.

Tags :

Advertisement