ముగిసిన దుబ్బాక బై ఎలక్షన్ పోలింగ్
By: Sankar Tue, 03 Nov 2020 6:38 PM
దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 6 గంటల వరకు చూసుకుంటే 81.14 శాతం పోలింగ్ నమోదైంది. అయితే చివరిగంటలో కోవిడ్ బాధితులకు అవకాశం కల్పించడంతో పీపీఈ కిట్లు ధరించి పోలింగ్లో పాల్గొన్నారు.
కాగా పోలింగ్ సమయం ముగిసినా క్యూలో నిల్చున్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ పరిశీలించారు. దీంతో పోలింగ్ శాతం మరోసారి 85శాతంకు పైగా నమోదయ్యే అవకాశం ఉంది. 2018 ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గంలో 86 శాతం పోలింగ్ నమోదైంది. కాగా దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం నవంబర్ 10న వెలువడనుంది.
కాగా లచ్చపేటలోని దుబ్బాక జిల్లా పరిషత్ హైస్కూలోని పోలింగ్ కేంద్రంలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతి హోళ్ళీకేరి పరిశీలించారు. ఈ మేరకు కోవిడ్ నిబంధనల మేరకు ప్రతీ ఓటరుకు థర్మల్ స్క్రీనింగ్ చేసి, శానిటైజరు అందిస్తూ.. చేతికి గ్లౌజు ఇవ్వడంతో పాటు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్న ఎన్నికల అధికారుల పనితీరును కలెక్టర్ అభినందించారు.