దుబ్బాక ఉప ఎన్నిక ..మధ్యాహ్నం లోగా ఫలితం వచ్చే అవకాశం
By: Sankar Tue, 10 Nov 2020 09:21 AM
ఉత్కంఠగా ఎదురుచూస్తున్న దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. పొన్నాల ఇందూరు ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. 8 గంటలకు తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. 8 గంటల 30 నిమిషాలకు ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది.
మధ్యాహ్నం 12 గంటలలోగా తుది ఫలితం వెలువడే అవకాశం ఉంది. ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ సహా 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ నెల 3న జరిగిన పోలింగ్లో 315 పోలింగ్ బూతుల్లో 1,64,186 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 82.61 పోలింగ్ శాతం నమోదైంది. ఒక్కో రౌండుకు 14 టేబుళ్లను ఏర్పాటుచేశారు. మొత్తం 23 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుంది.
ప్రతి టేబుల్ను ఓ మైక్రో అబ్జర్వర్స్తోపాటు మిగతా అధికారులు పర్యవేక్షించనున్నారు. టేబుళ్ల వద్ద జరిగే లెక్కింపు పర్యవేక్షణ బాధ్యతలను ఏఆర్వోలకు అప్పగించారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపును తాసిల్దార్, ఎంపీడీఓ స్థాయి అధికారి పర్యవేక్షిస్తున్నారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ ఆధ్వర్యంలో కౌంటింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. 357 మంది పోలీసులు భద్రతను పర్యవేక్షించనున్నారు.