ఇకపై డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనిఖీలు మరింత కఠినం...!
By: Anji Sat, 14 Nov 2020 09:48 AM
హైదరాబాద్లోని గచ్చిబౌలి, మాదాపూర్లో జరిగిన రోడ్డు ప్రమాదాలపై సీపీ సజ్జనార్ సీరియస్గా దృష్టి సారించారు. మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
రెండు ప్రమాదాలు మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్లే జరిగాయని నిర్థారణకు వచ్చారు.ఇకపై డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనిఖీలు మరింత కఠినతరం చేస్తామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఏసీపీ స్థాయి అధికారులతో డ్రంకన్ అండ్ డ్రైవింగ్ తనిఖీల కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఎవరైనా పబ్లో మద్యం సేవించి డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడితే 10 ఏళ్లు జైలు శిక్ష పడేలా కేసులు పెడతామని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. అంతే కాకుండా డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో పబ్ నిర్వాహకులను కూడా చేరుస్తామన్నారు. పబ్లో మద్యం సేవించి బయటకు వచ్చేవారిని ఇంటికి చేర్చే బాధ్యత పబ్ నిర్వాహకులదేనని అన్నారు.
వారికి ప్రత్యామ్నాయ డ్రైవర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. కాగా, మద్యం సేవించిన వారికి వెహికల్ ఇచ్చినా కూడా నేరమే అని, వాహనం యజమానిపై కూడా కేసు నమోదు చేస్తామని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.