మసాజ్ సెంటర్ కోసం గూగుల్ లో వెతికి కిడ్నాప్ అయిన డీఆర్డీవో సైంటిస్ట్
By: Sankar Tue, 29 Sept 2020 4:23 PM
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్డిఓ) జూనియర్ శాస్త్రవేత్త(45) హనీట్రాప్కు గురయ్యాడు. గడిచిన శనివారం నాడు మసాజ్ పార్లర్ల గురించి ఆన్లైన్లో వెతికి నోయిడాలోని ఓ హోటల్కు వెళ్లాడు. వెళ్లకగానీ తెలియలేదు అది హనీట్రాప్ అని. నిందితులు సైంటిస్ట్ ను బందీగా ఉంచారు. అనంతరం అతన్ని విడుదల చేయాలంటే రూ. 10 లక్షలు ఇవ్వాలని అతని ఇంటికి ఫోన్కాల్స్ కొట్టారు.
దీంతో భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆదివారం తెల్లవారుజామున శాస్ర్తవేత్త ఆచూకీని కనుగొని సురక్షితంగా రక్షించారు. సెక్టార్ 41లోని ఓయో హోటల్లో అతన్ని బందీగా ఉంచినట్లు గుర్తించారు. కిడ్నాప్కు సంబంధించి ఒక మహిళతో సహా ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. దీపక్ కుమార్, సునీతా గుర్జార్, రాకేశ్ కుమార్ అలియాస్ రింకు అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేయగా కిడ్నాప్లో పాల్గొన్న మరో ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు.
భార్యకు తెలియకుండా సదరు సైంటిస్ట్ ఆన్లైన్ లో మసాజ్ పార్లర్ కోసం వెతికాడు. ఈ క్రమంలో అతను ఒక వ్యక్తితో కనెక్ట్ అయ్యాడు. శనివారం సాయంత్రం నోయిడా సిటీ సెంటర్లో తనను కలవమని చెప్పడంతో అతన్ని కలిసేందుకు అక్కడికి వెళ్లాడు. దీంతో కిడ్నాప్కు గురయ్యాడు. భార్య ఆదివారం ఉదయం వేళ్లలో వచ్చి ఫిర్యాదు చేయడంతో మూడు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టాం. గంటల వ్యవధిలోనే సైంటిస్ట్ను సురక్షితంగా రక్షించినట్లు తెలిపారు.