ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా మరోసారి బరిలోకి...!
By: Anji Thu, 08 Oct 2020 09:18 AM
గుంటూరు, కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి బరిలోకి దిగుతానని సిట్టింగ్ ఎమ్మెల్సీ డాక్టర్ ఏఎస్ రామకృష్ణ ప్రకటించారు. బుధవారం ఆయన గుంటూరులోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసారి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలవనున్నట్లు ఆయన తెలిపారు.
2015 మార్చిలో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ బలపరిచిన అభ్యర్థిగా 1800 ఓట్ల మెజారిటీతో గెలుపొందానని, ఆ సమయంలో అందరూ మద్దతు తెలిపారని రామకృష్ణ పేర్కొన్నారు. ఏ ఆశయాలతో అయితే ఉపాధ్యాయులు తనను ఎన్నుకున్నారో వాటి సాధనకోసం నిరంతరం కృషిచేశానని చెప్పారు.
పాఠశాలల ఉపాధ్యాయుల స్థాయి నుంచి యూనివర్సిటీ ప్రొఫెసర్ల వరకు అందరి కోసం పనిచేశానన్నారు. 10వ పీఆర్సీలో 43శాతం ఫిట్మెంట్ సాధన, అధ్యాపకులకు పే బాండ్ తన కృషి ఫలితమేనన్నారు. ఎయిడెడ్ ఉపాధ్యాయ, అధ్యాపకులకు ప్రతినెల 1వ తేదీ జీతాలు ఇప్పించటంలో అందరిని ఒప్పించానని, గురుకులాలు, కస్తూర్బా పాఠశాలలు, మోడల్ స్కూల్ టీచర్ల సమస్యల పరిష్కారానికి, వారికి పీఆర్సీ అమలులో తీవ్ర కృషి చేశానని తెలిపారు.
గుంటూరు, కృష్ణా జిల్లాల ఉపాధ్యాయులు తనను మళ్లీ గెలిపిస్తే రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తానని, అలానే అర్హతగల ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.