మళ్ళీ అందుబాటులోకి రానున్న డబల్ డెక్కర్ బస్సులు
By: Sankar Thu, 03 Dec 2020 3:07 PM
త్వరలో భాగ్యనగరంలో డబుల్ డెక్కర్ బస్సులు పరుగుపెట్టే అవకాశం ఉంది. గత నెల ఓ వ్యక్తి ట్వీట్కు స్పందించిన మంత్రి కేటీఆర్ సూచనతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ మేరకు సర్వే చేసిన అధికారులు డబుల్ డెక్కర్ బస్సులను నడిపించగలిగే 5 మార్గాలను ప్రాథమికంగా గుర్తించారు. ఈ మార్గాల్లో తొలుత పది డబుల్ డెక్కర్ బస్సులు నడపాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ నెలాఖరు వరకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది..
నగరం నుంచి పటాన్చెరు వరకు మళ్లీ నడపాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్, కోఠి నుంచి ప్రస్తుతం పటాన్చెరుకు సాధారణ బస్సులు మంచి ఆక్యుపెన్సీ రేషియోతో తిరుగుతున్నాయి. ఆ మార్గానికి మంచి డిమాండ్ ఉండటంతో ఆయా మార్గాల్లో వీటిని తిప్పితే బాగుంటుందన్న యోచనలో ఉన్నట్లు సమాచారం.
అలాగే మేడ్చల్ రూట్లో ఉండే సుచిత్ర, కొంపల్లి వరకు మంచి రద్దీతో బస్సులు తిరుగుతున్నాయి. ఆ మార్గంలో కూడా తిప్పితే బాగుంటుందని యోచిస్తున్నారు. పాత బస్తీ నుంచి మెహిదీపట్నం, అక్కడి నుంచే జీడిమెట్ల వైపు కూడా సర్వీసులు తిప్పితే బాగుంటుందని భావిస్తున్నారు. దుర్గం చెరువు వద్దకు కూడా ఓ సర్వీసు ఉండేలా చూడా లని భావిస్తున్నారు...