ఐపీఎల్ లో డోపింగ్ పరీక్షలు
By: Dimple Thu, 27 Aug 2020 01:33 AM
దుబాయ్లో నిర్వహించే ఐపీఎల్ మ్యాచ్లను సమర్థవంతంగా నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఇప్పటికే అన్ని జట్లు దుబాయ్, అబుదాబి నగరాలకు చేరుకున్నారు. అందరికీ హోటళ్లలో ప్రత్యేక గదులు కేటాయించారు. ఆరు రోజుల క్వారంటైన్ పూర్తయింది. దుబాయ్, అబుదాబి, షార్జా క్రికెట్ స్టేడియాల్లో విడతలవారీగా ప్రాక్టీస్ మ్యాచులను నిర్వహించబోతున్నారు.
క్రికెటర్లపై డోపింగ్ పరీక్షల విషయంలో ఎలాంటి ఉదాసీనతకు తావు ఇవ్వరాదని జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) భావిస్తోంది. అందుకే దుబాయ్లో సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నీలో డోపింగ్ పరీక్షలు నిర్వహించాలని ‘నాడా’ నిర్ణయించింది. ఇందు కోసం శాంపిల్స్ను సేకరించేందుకు ‘నాడా’కు చెందిన ముగ్గురు ఉన్నతాధికారులు, ఆరుగురు డోప్ కంట్రోల్ అధికారులు యూఏఈకి వెళ్లనున్నారు.
ఐపీఎల్లో కనీసం 50 మంది క్రికెటర్లు శాంపిల్స్ తీసుకోవాలని ఈ సంస్థ ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. ‘నాడాకు చెందిన తొమ్మిది మంది అధికారులు యూఏఈలో ఉంటారు. వారికి యూఏఈ డోపింగ్ నిరోధక సంస్థ కూడా సహకరిస్తుంది. మేం సిద్ధం చేసిన బయో బబుల్లోనే వారు కూడా ఉంటారు.
దీనికయ్యే మొత్తం ఖర్చును ఎవరు భరిస్తారనేది మాత్రం మేం ఇప్పుడే చెప్పలేం’ అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. పరీక్షల కోసం మూడు మ్యాచ్ వేదికలతో పాటు రెండు ప్రాక్టీస్ వేదికల వద్ద కలిపి మొత్తం ఐదు డోపింగ్ టెస్టు కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. మరో వైపు కొందరు ఆటగాళ్ల బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకొని ఖతర్లో ‘వాడా’ గుర్తింపు పొందిన కేంద్రంలో పరీక్షించే అవకాశం కూడా ఉంది.
ప్రశాంత వాతావరణంలో నీట్ నిర్వహణ, మార్గదర్శకాలివే
ఇంటర్మీడియట్ విద్యార్హతతో వైద్యవిద్య, ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి జాతీయస్థాయిలో నిర్వహింప తలపెట్టిన నీట్, జెఈఈ పరీక్షలు సెప్టెంబరు ఒకటో తేదీనుండి ఆరంభం కాబోతున్నాయి. జులైలో జరగాల్సిన జాతీయ స్థాయి వైద్య విద్య, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు నీట్, జేఈఈ.. కరోనా మహమ్మారి కారణంగా వాయిదాపడ్డ సంగతి తెలిసిందే.
కాగా, ఈ పరీక్షల నిర్వహణ తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (ఎన్టీఏ) ఇటీవల ప్రకటించింది. జేఈఈ ప్రాథమిక పరీక్ష (మెయిన్) సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు.. నీట్ (యూజీ) పరీక్షను సెప్టెంబర్ 13న నిర్వహించనుంది. ఈ క్రమంలో జేఈఈ హాల్టికెట్లు ఇప్పటికే విడుదల కాగా, నీట్ అడ్మిట్కార్డులు నేటి నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో.. కరోనా పరిస్థితులకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎన్టీఏ ప్రకటించింది. అంతేకాకుండా ఈ పరీక్షలు రాసే విద్యార్థులకు మార్గదర్శకాలను కూడా సంస్థ నిర్దేశించింది.
*విద్యార్థులు భౌతిక దూరాన్ని పాటించాలి.
*పరీక్షల విధుల్లో ఉన్న సిబ్బందికి గ్లౌజులు, మాస్కులు ధరించేందుకు అనుమతి ఉంది. వాటిని తెచ్చుకోని విద్యార్థులకు నిర్వాహకులే అందజేస్తారు.
*ప్రతి కేంద్రం వద్ద శానిటైజర్ ఏర్పాటు ఉంటుంది.
*డెస్కులు, టేబుళ్లు, డోర్ హ్యాండిల్ వంటివి క్రిమిరహితం చేసేందుకు స్ప్రే బాటిళ్లు, స్పాంజ్ లేదా వస్త్రాన్ని అందుబాటులో ఉంచుతారు.
*పరీక్షా కేంద్రం ప్రవేశ ద్వారాల వద్ద శరీర ఉష్ణోగ్రతను పరిశీలించే థెర్మోగన్లను ఏర్పాటు చేస్తున్నారు.
అంతేకాకుండా దేశవ్యాప్తంగా జేఈఈ పరీక్షా కేంద్రాల సంఖ్యను 570 నుంచి 660కి.. నీట్ పరీక్షా కేంద్రాల సంఖ్య 2546 నుంచి 3843కు పెంచినట్టు ఎన్టీఏ ప్రకటించింది. భౌతిక దూరం నిబంధనకు అనుగుణంగా.. జేఈఈలో విద్యార్థులకు వరుస విడిచి వరుసలో సీట్లు కేటాయించగా, నీట్ విద్యార్థులు గదికి కేవలం 12 మందే ఉంటారని తెలిపింది.