మాస్క్ తీసేసి శ్వేత సౌధంలో హడావిడి చేసిన ట్రంప్
By: Sankar Wed, 07 Oct 2020 06:58 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాటకీయ ఫక్కీలో తిరిగి వైట్హౌస్కు చేరుకున్నారు. కోవిడ్–19 పాజిటివ్గా తేలిన తర్వాత మిలిటరీ ఆస్పత్రిలో నాలుగు రోజులపాటు అసాధారణ రీతిలో వైద్య చికిత్సలు పొందిన ఆయన సోమవారం రాత్రి తిరిగి అధ్యక్ష భవనానికి వచ్చారు. కరోనాను చూసి భయపడటం లేదంటూ, మాస్క్ తీసేసిన ట్రంప్పై పలువురు మండిపడుతున్నారు.
తనతోపాటు భార్య మెలానియా, శ్వేతసౌధంలోని పలువురు సిబ్బంది అనారోగ్యం బారిన పడినా కోవిడ్ పట్ల తన మొండివైఖరిని మార్చుకోకపోవడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెరైన్ వన్ హెలికాప్టర్లో వైట్హౌస్కు చేరుకున్న ట్రంప్ ఉత్సాహంగా ఫిట్గా ఉన్నట్లు చూపడానికి..మాస్కు తీసేసి ఎలివేటర్కు బదులుగా పోర్టికో మెట్లద్వారా బాల్కనీకి చేరుకున్నారు..
అక్కడి నుంచి వెళ్లిపోతున్న మెరైన్ ఒన్ హెలికాప్టర్కు సెల్యూట్ చేశారు. అనంతరం ట్విట్టర్లో ఆయన..‘2.10 లక్షల మంది ప్రజలు చనిపోయినా భయపడాల్సిన పనిలేదు’ అని పేర్కొన్నారు. ‘ప్రత్యర్థి బైడెన్తో ఈనెల 15వ తేదీన మియామీలో జరగనున్న డిబేట్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నా’అని తెలిపారు.
‘నేనే ముందుంటా. నాయకత్వం వహిస్తా. నేను చేసినట్లుగా ఏ నాయకుడూ చేయలేడు. రిస్క్ ఉందని నాకు తెలుసు. అయినా సరే. ఇప్పుడు మరింత మెరుగ్గా ఉన్నా. నాకు నిరోధకత ఉండి ఉండొచ్చు’అని పేర్కొన్నారు. అంతకుముందు, వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ సెంటర్ నుంచి డిశ్చార్జి అయిన ట్రంప్ మాస్కు ధరించి ఒంటరిగా బయటకు వచ్చారు.