వీడియో కాల్ మాట్లాడుతూ ఆపరేషన్ ..ఆపరేషన్ వికటించి గర్భిణీ మృతి
By: Sankar Tue, 01 Sept 2020 2:21 PM
వైద్యులు దేవుడితో సమానం అని అంటారు..ఎందుకంటే పోతున్న ప్రాణాలను నిలబెట్టేది వాళ్ళే కాబట్టి..అయితే వైద్యులు ఏ మాత్రం అశ్రద్దగా ఉన్న రోగుల ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది..తాజాగా హైదరాబాద్లో వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది.
గర్భిణికి సిజేరియన్ చేసినప్పుడు అక్కడ ఉన్న వైద్యులు నర్సు వీడియో కాల్ మాట్లాడుతూ నిర్లక్ష్యం వహించడంతో బాలింత మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. దీంతో మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని గాయత్రిహిల్స్లోని నవభారత్నగర్కు చెందిన ఎం.జానకి (23)కి పురిటినొప్పులు ఎక్కువవడంతో కుటుంబ సభ్యులు ఈ నెల 28న ఉదయం శ్రీరామ్నగర్లోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి తీసుకువచ్చారు. 29న అర్ధరాత్రి 2.30 గంటలకు ఆసుపత్రిలోని వైద్యురాలు, మరో నర్సు, ఇతర సిబ్బంది సిజేరియన్ చేయగా మగబిడ్డ పుట్టాడు. ఆ తరువాత జానకి ఆరోగ్యం విషమించడంతో తెల్లవారుజామున 4.30 గంటలకు నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ జానకి శనివారం ఉదయం మృతి చెందింది. శస్త్రచికిత్స చేసిన సమయంలో ఓ నర్సు, మరో వైద్యురాలు వీడియో కాల్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని జానకి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నాడు. దీంతో ఆపరేషన్ వికటించి జానకి మృతి చెందిందని అంటున్నారు. ఆమె కుటుంబ సభ్యులు ఎస్సార్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిర్లక్ష్యం కింద వైద్య సిబ్బందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఇన్స్పెక్టర్ చెప్పారు.