కోట్లలో రుణం ఇప్పిస్తా అని చెప్పి 40 లక్షలు దోచుకున్న కేటుగాడు
By: Sankar Sun, 02 Aug 2020 9:50 PM
రూ .8 కోట్ల రుణం ఇప్పిస్తానని చెప్పి ఓ డాక్టర్ వద్ద రూ .40 లక్షలు కొట్టేశాడు ఓ మోసగాడు. తాను బ్యాంకు ఉద్యోగినని నమ్మించి వైద్యుడికి కుచ్చుటోపీ పెట్టాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పుణె డివిజన్లో జరిగింది.
పుణె డివిజన్లోని పింప్రీ చిన్చ్వాడ్ పట్టణంలోగల అకుర్దిలో ఓ డాక్టర్ కొన్నేళ్లుగా దవాఖాన నడుపుతున్నాడు. అయితే, ఇటీవల దాన్ని విస్తరించేందుకు లోన్ తీసుకోవాలనుకున్నాడు. గత నెల ఒక వ్యక్తిని సంప్రదించాడు. ఆ వ్యక్తి కారులో వచ్చి, కొవిడ్-19 వ్యాప్తి సాకుగా చూపి అందులోనే ఉండి ముఖం కనిపించకుండా మాట్లాడాడు.
తాను ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగినని, రుణం మంజూరు చేసేందుకు రూ .40 లక్షలు తనకు చెల్లించాలని చెప్పాడు. అలాగే, కేవైసీ పూర్తి చేయాలని, ఇందుకు కొన్ని పత్రాలను సమర్పించాలని సూచించాడు. డాక్టర్ రెండో ఆలోచన లేకుండా డబ్బు మొత్తం చెల్లించాడు. అనంతరం అతడిని సంప్రదించేందుకు ప్రయత్నిస్తే ఫోన్ స్విచ్ఛాప్ వచ్చింది. దీంతో మోసపోయినట్లు తెలుసుకున్న సదరు డాక్టర్ ప్రస్తుతం పోలీసులను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నాడు.