హరీశ్ రావు మాటలు నమ్మొద్దు...!
By: chandrasekar Fri, 16 Oct 2020 7:58 PM
తెలంగాణ బీజేపీ నేత, సినీనటుడు
బాబూమోహన్ దుబ్బాక ప్రజల సమస్యలు తీరాలంటే బీజేపీకే ఓటు వేయాలని పేర్కొన్నారు.
దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు తరపున
ప్రచారం చేసారు. దుబ్బాకకు సీఎం కేసీఆర్ ఏమీ చేయరని ఆయన అన్నారు. ఆయన ఎవరికీ
కనిపించరని ఆయన కూడా కరోనా లాంటి వాడని బాబూమోహన్ ఎద్దేవా చేశారు. దుబ్బాకలో
టీఆర్ఎస్ను గెలిపించినా వారిని ప్రగతి భవన్ గేటు దగ్గరికి కూడా రానివ్వరని
బాబూమోహన్ అన్నారు. మల్లన్నసాగర్ ముంపు బాధితుల సమస్యలు తీరాలంటే బీజేపీకి ఓటు
వేయాలని కోరారు. బీజేపీని గెలిపిస్తే ఈ సమస్య తీర్చేందుకు రఘునందన్ రావు నేరుగా
ప్రధాని మోదీ దగ్గరకే వెళతారని బాబూమోహన్ చెప్పారు. రఘునందన్ రావు గెలిస్తేనే
మల్లన్నసాగర్ ముంపు బాధితుల సమస్యలు తీరుతాయని మరోసారి ఆయన స్పష్టం చేశారు.
గజ్వేల్, సిద్ధిపేటను
అభివృద్ధి చేసుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం దుబ్బాకలో మాత్రం అభివృద్ధి ఎందుకు
చేపట్టలేదని బాబూమోహన్ ప్రశ్నించారు.
మల్లన్నసాగర్ ముంపు
బాధితులను మంత్రి హరీశ్ రావు ఎన్ని ఇబ్బందులు పెట్టాడో తనకు తెలుసని ఆయన
ఆరోపించారు. ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్ రావు ప్రజలను మభ్యపెడుతున్నారని
వ్యాఖ్యానించాడు. ఎన్నికల తరువాత ఈ నేతలెవరూ మీకు కనిపించరని బాబూమోహన్ అన్నారు.
రఘనందన్ రావు మాటంటే మాటే అని ఆయన చెప్పిన మాట చేసి చూపిస్తారన్నారు. తెలంగాణ
ఉద్యమంలో ఉన్నవాళ్లెవరూ ఇప్పుడు కేసీఆర్ వెంట లేరని బాబూమోహన్ తెలిపారు. ఒకప్పుడు
కేసీఆర్ను తిట్టిన వాళ్లే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నారని ఆరోపించారు.
ప్రజలను పట్టించుకోని టీఆర్ఎస్కు ఎన్నికల ముందు టికెట్ కోసం పార్టీ మారిన
కాంగ్రెస్ నాయకుడిని ఓటు వేయొద్దని బాబూమోహన్ ప్రజలను కోరారు.