కారు గుర్తును పోలిన ఎన్నికల గుర్తులను ఇతర పార్టీలకు కేటాయించవద్దు: టీఆర్ఎస్
By: chandrasekar Tue, 17 Nov 2020 11:31 AM
గ్రేటర్ హైదరాబాద్
మునిసిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దుబ్బాక ఉప ఎన్నికలో ఎదురైన తప్పు మరోసారి
జరుగకుండా ఉండేందుకు టీఆర్ఎస్ పార్టీ నష్టనివారణ చర్యలు చేపట్టింది. అందులో
భాగంగానే కారు గుర్తును పోలిన ఎన్నికల గుర్తులను ఇతర పార్టీల అభ్యర్థులకు కానీ
లేదా స్వతంత్ర అభ్యర్థులకు కానీ ఎవరికీ కేటాయించవద్దని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర
ఎన్నికల కమిషనర్కు విజ్ఞప్తి చేసింది. టీఆర్ఎస్ పార్టీ సొంతమైన ఎన్నికల చిహ్నం
కారును పోలిన గుర్తుల వల్ల తాము నష్టపోతున్నామని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు
బోయినపల్లి వినోద్ కుమార్ ఈ సందర్భంగా ఈసీకి ఫిర్యాదుచేశారు.
టీఆర్ఎస్ పార్టీ నేతలు
లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ రెడ్డితో కలిసి సోమవారం రాష్ట్ర ఎన్నికల
కమిషనర్ పార్థసారథిని కలిసిన బోయినపల్లి వినోద్ కుమార్.. ఎన్నికల్లో ఈసి
కేటాయించే గుర్తులలో కారును పోలిన కొన్ని గుర్తులపై అభ్యంతరాలు వ్యక్తంచేశారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అలాంటి గుర్తులను పూర్తిగా తొలగించాలని ఈసిని
కోరారు. ఇదిలావుంటే, ఇటీవల
జరిగిన దుబ్బాక ఉపఎన్నికలో బండారు నాగరాజు అనే స్వతంత్ర అభ్యర్థికి కారు గుర్తును
పోలిన రోటీ మేకర్ గుర్తును కేటాయించారు. దీంతో ఎన్నికల్లో ఆ అభ్యర్థికి 3500లకుపైగా
ఓట్లు వచ్చాయి. నాగరాజుకు పోల్ అయిన ఓట్లన్ని అతడి గుర్తు కారు గుర్తును పోలి
ఉండటం వల్ల వచ్చినవేనని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే గ్రేటర్
ఎన్నికల్లో మరోసారి అటువంటి చేదు అనుభవం ఎదురు కాకుండా ఉండేందుకు టీఆర్ఎస్
పార్టీ ముందుగానే నష్ట నివారణ చర్యలు చేపట్టింది.