Advertisement

కాంగ్రెస్‌లో మ‌ళ్లీ అసంతృప్తి...

By: chandrasekar Mon, 16 Nov 2020 4:40 PM

కాంగ్రెస్‌లో మ‌ళ్లీ అసంతృప్తి...


ఇటీవ‌లే 23 మంది కాంగ్రెస్‌ పార్టీ సీనియ‌ర్లు .. అధ్యక్షురాలు సోనియా గాంధీపై త‌మ అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా బీహార్ ఎన్నిక‌ల్లో ఘోర వైఫ‌ల్యాన్ని ఎదుర్కొన్న నేప‌థ్యంలో.. ఆ పార్టీ సీనియ‌ర్ నేత క‌పిల్ సిబ‌ల్ మ‌రోసారి త‌న ఆవేద‌న బయట పెట్టారు. దేశ ప్ర‌జ‌లు కాంగ్రెస్ పార్టీని ఓ ప్ర‌త్యామ్నాయంగా చూడ‌డం లేద‌ని ఆయ‌న అన్నారు. ఓ ఆంగ్ల ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో అంత‌ర్గ‌త సంక్షోభం ఉంద‌న్న సంకేతాల్ని ఆయ‌న మ‌రోసారి పేర్కొన్నారు. భ‌విష్యుత్తును దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని కొత్త మార్గంలో న‌డిపాల‌న్నారు. క‌మ్యూనికేష‌న్ విప్ల‌వానికి అనుగుణంగా ముందుకు వెళ్లాల‌న్నారు. బీహార్ ఎన్నిక‌ల్లో ఆర్జేడీ .. ప్ర‌త్యామ్నాయ పార్టీగా నిలిచింద‌ని క‌పిల్ అన్నారు. గుజ‌రాత్‌లో జ‌రిగిన బై ఎలక్షన్ ‌లోనూ కాంగ్రెస్ ఓట‌మి పాలైంద‌న్నారు. ఆ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెల‌వ‌లేద‌న్నారు. లోక్‌స‌భ‌లోనూ ఆ రాష్ట్రంలో సీటు సాధించ‌క‌పోవ‌డం విచారకరమని అన్నారు. యూపీలో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో కూడా కొన్ని చోట్ల 2 శాతం ఓట్లు కూడా కాంగ్రెస్‌ పార్టీకి పోల‌వ్వ‌లేదు. ఈ ద‌శ‌లో కాంగ్రెస్ పార్టీ అవ‌లోక‌నం చేసుకోవాల‌న్న అభిప్రాయాలు వినిపిస్తున్న‌ట్లు క‌పిల్ సిబ‌ల్ పేర్కొన్నారు.

బీహార్‌లో సీట్ల పంప‌కం విష‌యంలో కాంగ్రెస్ పార్టీని దెబ్బ‌తీసింద‌ని సీనియ‌ర్ నేత తారిక్ అన్వ‌ర్ అన్నారు. ఎక్క‌డ అసెంబ్లీ ఎన్నిక‌లు ఉన్నా.. అక్క‌డ వీలైనంత త‌ర్వ‌గా కూట‌మిల‌ను ఏర్పాటు చేయాల‌న్నారు. ఆల‌స్యం అయితే ఓట‌మి ఖచ్చితం అవుతోంద‌న్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి లోపాలు ఉన్నాయో తెలుసు అని, వ్య‌వ‌స్థీకృతంగా ఎటువంటి త‌ప్పులు జ‌రుగుతున్నాయో తెలుస‌ని క‌పిల్ సిబ‌ల్ అన్నారు. అన్నింటికీ స‌మాధానాలు ఉన్నాయ‌ని, కాంగ్రెస్ పార్టీకి ఆ స‌మాధానాలు తెలుసు అని, కానీ ఆ స‌మాధానాల‌ను వాళ్లు ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు. పార్టీ పెద్ద‌లు ఇలా మౌనంగా ఉంటే.. కాంగ్రెస్ పార్టీ మ‌రింత ప‌త‌నం అవుతుంద‌ని క‌పిల్ పేర్కొన్నారు. కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ ఓ నామినేటెడ్ వ్య‌వ‌స్థ అని, నామినేట్ అయిన స‌భ్యులను ఓట‌మి గురించి ఏమీ ప్ర‌శ్నించ‌లేమ‌న్నారు. గ‌తంలో అధినాయ‌క‌త్వానికి పంపిన ధిక్కార లేఖ‌పై స్పందిస్తూ.. హై క‌మాండ్ ఎటువంటి సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టేందుకు ఆస‌క్తిగా లేన‌‌ట్లు తెలుస్తోంద‌న్నారు.

నామినేష‌న్ ప‌ద్ధ‌తిలో ఎన్నిక‌ల‌కు వెళ్తే ఫ‌లితాలు ఇలాగే ఉంటాయ‌న్నారు. తాము ఇచ్చిన ఫిర్యాదుల‌ను హైక‌మాండ్ ప‌ట్టించుకోలేద‌ని, అందుకే ఇలాంటి ఫ‌లితాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తోంద‌న్నారు. అనుభ‌వం ఉన్న వారితో పార్టీ పెద్ద‌లు మాట్లాడాల‌ని, దేశంలో రాజ‌కీయ వాస్త‌వాలు మారుతున్నాయ‌ని, క‌మ్యూనికేష‌న్ విప్ల‌వం వ‌చ్చింద‌న్నారు. ప్ర‌ధాన మీడియా అనేది ప్ర‌భుత్వ నియంత్ర‌ణ‌లోకి వెళ్తోంద‌ని, అలాంటి స‌మ‌యాల్లో కొత్త త‌ర‌హా విధానాల‌ను వెతుక్కోవాల్సి వ‌స్తోంద‌న్నారు. బీహార్ ఫ‌లితాల‌పై హైక‌మాండ్ ఎటువంటి ప‌రిశీల‌న చేయ‌లేద‌ని, అంతా బాగుంద‌న్న ఆలోచ‌న‌లో వారు ఉండి ఉంటార‌ని క‌పిల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ మ‌ళ్లీ రాణిస్తుంద‌న్న ఆశాభావాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు.

Tags :
|
|

Advertisement