ధోనీ మామూలోడు కాదు - మైకేల్ హోల్డింగ్ అభినందన
By: Dimple Mon, 24 Aug 2020 11:38 AM
మహేంద్ర సింగ్ ధోనీ తన చాకచక్యంతో క్రికెట్లో అద్బుతాలు సాధించి.. ఎవరికీ అంతుబట్టని ఆటగాడిగా ఎదిగాడని అభినందనలు వెల్లువెత్తున్నాయి. టీమ్ఇండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ వీరుడని వెస్టిండీస్ దిగ్గజం మైకెల్ హోల్డింగ్ అన్నారు. మిడిలార్డర్లో అతనెప్పుడూ ఆటను నియంత్రించాడే కానీ, విఫలం కాలేదని ప్రశంసించారు. టెస్టుల్లో వికెట్ కీపింగ్ చేస్తూ దాదాపు 5000 పరుగులు చేయడం సులభమేమీ కాదని పేర్కొన్నారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా హోల్డింగ్ మాట్లాడారు.
ఐసీసీ వన్డే, టీ20 ప్రపంచకప్లు, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ఏకైక కెప్టెన్ మహీనే. ఆగస్టు 15న ఆయన అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. 2019 ప్రపంచకప్లో న్యూజిలాండ్తో సెమీస్ ఓటమి తర్వాత ధోనీ మైదానంలో అడుగు పెట్టని సంగతి తెలిసిందే.
‘జులపాల జుట్టుతో వన్డే క్రికెట్ ఆడుతుంటే ధోనీ వీరుడిలా అనిపించాడు. ముందుకొచ్చిన అన్నిటినీ నాశనం చేసేలా కనిపించాడు. నిజానికి అతడదే పనిచేశాడు. వన్డే కెరీర్లో 229 సిక్సర్లు బాదేశాడు. ఆ గణాంకాల గురించి ఆలోచిస్తుంటే.. అన్ని సిక్సర్లు బాదాలంటే ధోనీ కనీసం 40 ఏళ్లు ఆడాల్సింది అనిపిస్తుంది. కానీ అతడి స్వభావం అలాంటిది మరి’ అని హోల్డింగ్ అన్నారు.
టాప్ ఆర్డర్లో మహీ విరుచుకుపడేవాడు. మిడిలార్డర్కు వెళ్లాక నియంత్రణ కోల్పోవడం ఎప్పుడూ చూడలేదు. అతనో అద్భుతమైన సారథి. సహనం కోల్పోతున్నట్టు ఎప్పుడూ కనిపించలేదు.
పరిస్థితులు చేజారుతున్నాయని అనిపిస్తే ఆటగాళ్లను పిలిచి నిగ్రహంతో మాట్లాడేవాడు. మార్పులు సూచించేవాడు. దాంతో అన్నీ మారిపోయేవి. టెస్టుల్లో అతడు 5000 పరుగులు చేశాడు. వికెట్ కీపర్గా అన్ని పరుగులు చేయడం అసాధారణం. వన్డేల్లోనూ దాదాపు 11000 పరుగులకు చేరువయ్యాడు’ అని హోల్డింగ్ తెలిపారు.