2021 ఐపిఎల్లో పాల్గొనడంపై ధోనీ స్పందన...
By: chandrasekar Mon, 02 Nov 2020 3:18 PM
ఐపిఎల్ 2020 సీజన్లో
చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ప్లేఆఫ్స్ రేసులో నిలవలేదు. గెలవాల్సిన మ్యాచ్లు
కూడా ఓడిపోతూ రావడం 13 మ్యాచ్ల్లోనూ ధోనీ మొత్తం స్కోర్ కేవలం 200
పరుగులే కావడం వంటివి అతడిపై తీవ్ర ఒత్తిడిని పెంచాయి. గతంలో అదే చెన్నై సూపర్
కింగ్స్ ఫ్రాంచైజీకి 3 ఐపిఎల్ ట్రోఫీలు అందించిన ధోనీ సత్తా గురించి
తెలిసిన వాళ్లు అతడిని వేలెత్తి చూపకపోయినా కొంతమంది ధోనీ ఓటములపై విమర్శలు
చేస్తూనే ఉన్నారు. దీంతో వచ్చే ఐపిఎల్ సీజన్లో ధోనీ పాల్గొనే అవకాశాలు లేవని
కొందరు, ఒకవేళ
పాల్గొన్నా చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం అతడిని తీసుకోకపోవచ్చని ఇంకొందరు రకరకాల
కామెంట్స్ చేయడం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. అయితే, ఇదే
విషయమై తాజాగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో మ్యాచ్కి ముందు టాస్ సందర్భంగా
ధోనీతో కామెంటేటర్ డేనీ మారిసన్ మాట్లాడుతూ.. ''చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఇదే నీ చివరి మ్యాచ్'' అని
భావిస్తున్నారా అని అడగ్గా ''తప్పకుండా ఇది చివరి మ్యాచ్ కాదు'' అంటూ
ధోనీ సమాధానం ఇచ్చాడు. తాను వచ్చే ఏడాది కూడా చెన్నై సూపర్ కింగ్స్ తరపునే తాను
ఐపిఎల్ 2021 బరిలో
దిగుతాను అని ధోనీ చెప్పకనే చెప్పాడు.
ధోనీ చెప్పిన ఈ మాటలు
అతడి అభిమానులకు కచ్చితంగా ఎంతో ఆనందానికి గురిచేస్తాయడనడంలో సందేహం లేదు. చెన్నై
సూపర్ కింగ్స్ సీఈఓ కాశి విశ్వనాథన్ సైతం
గతంలో ఇదే విషయంపై స్పందిస్తూ... ఒక్కసారి సరిగ్గా ఆడనంత మాత్రాన్నే అన్ని
మార్చేయాలనుకోవడం తప్పని తన అభిప్రాయాన్ని తెలిపారు. అంతేకాకుండా గతంలో తమ
ఫ్రాంచైజీకి మూడు టైటిల్స్ అందించిన ధోనీ సామర్ధ్యాన్ని సందేహించాల్సిన అవసరం
లేదని చెప్పి అతడిని సమర్ధించడంతో పాటు వచ్చే ఏడాది కూడా ధోనీ తమ జట్టులోనే
ఆడుతాడని తేల్చిచెప్పాడు. దీనికితోడు ఇప్పుడు ధోని కూడా అదే చెప్పడం అతడి
అభిమానులకు సంతోషాన్నిచ్చింది.