ధోని తనపై తానే నమ్మకాన్ని కోల్పోయాడు ..ఆకాష్ చోప్రా
By: Sankar Sun, 27 Sept 2020 07:23 AM
ఐపీఎల్ 2020లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తనపై తానే నమ్మకం కోల్పోయాడని భారత మాజీ క్రికెటర్, ఐపీఎల్లో ప్రస్తుత కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
తాజా సీజన్లో మూడు మ్యాచ్లాడిన చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్లో ముంబయి ఇండియన్స్పై గెలిచినా.. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో పరాజయాన్ని చవిచూసింది. తొలి మ్యాచ్లో చెన్నైని గెలిపించిన అంబటి రాయుడు.. తర్వాత రెండు మ్యాచ్లకి గాయం కారణంగా దూరమవగా.. ఆ ప్రభావం టీమ్పై పడినట్లు ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.
రాయుడు జట్టులో లేకపోవడంతో అదనంగా ఒక బ్యాట్స్మెన్ని తుది జట్టులోకి తీసుకున్న ధోనీ.. కేవలం ఐదుగురు బౌలర్లతోనే మ్యాచ్లు ఆడుతున్నాడు. ఐపీఎల్లో ధోనీ ఇలా ఐదు బౌలర్లతోనే తుది జట్టుని ఎంచుకోవడం తాను చూడలేదని ఆకాశ్ చోప్రా వెల్లడించాడు.
ఐపీఎల్ 2020లో చెన్నై సూపర్ కింగ్స్ తడబాటుపై తన యూట్యూబ్ ఛానల్లో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ ‘‘నాకు తెలిసి కెప్టెన్గా ధోనీ ఐదుగురు బౌలర్లతో మ్యాచ్ ఆడుతుండటం ఇదే తొలిసారి. నిజానికి ధోనీ ఐదుగురు బౌలర్లు, ఆరుగురు బ్యాట్స్మెన్ల ఫార్మాలా నచ్చదు. కానీ.. తాజా సీజన్లో చెన్నై టాప్ ఆర్డర్ బలహీనత కారణంగా తప్పడం లేదు. ధోనీ కూడా తన ఫామ్పై తానే నమ్మకం కోల్పోయినట్లున్నాడు.
రుతరాజ్ గైక్వాడ్, మురళీ విజయ్ పరుగులు చేయకపోవడంతో ఆరుగురు బౌలర్లతో ఆడే సాహసం ధోనీ చేయడం లేదు. ఇక రవీంద్ర జడేజా ఫస్ట్ మ్యాచ్ నుంచి 4 ఓవర్లు వేస్తూ కనీసం 40 పరుగులు ఇచ్చేస్తున్నాడు. ధోనీ అతడ్ని అతిగా నమ్ముకుంటే ప్రయోజనం లేదు’’ అని ఆకాశ్ చోప్రా వెల్లడించాడు.