ఈ నెల 21 వరకు అందరు అప్రమత్తంగా ఉండండి ..భారీ వర్షాలపై హెచ్చరించిన డీజీపీ
By: Sankar Sun, 18 Oct 2020 1:44 PM
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్రెడ్డి పేర్కొన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో పోలీసు శాఖ చేపడుతున్న సహాయక చర్యలపై ఆయన అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో శనివారం అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ నెల 21వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు ఉంటాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో పోలీసు సిబ్బంది 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు, ముందస్తు వ్యూహాలు సిద్ధం చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో జిల్లా కలెక్టర్లు, ఇతర శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పలు ప్రాంతాల్లో వరద ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో నదులు, చెరువులు, రిజర్వాయర్లు తదితర జలవనరుల వద్ద అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.