- హోమ్›
- వార్తలు›
- కరోనా వల్ల తీవ్రంగా ఆరోగ్యం క్షీణించిన వారికి డెక్సామెథసోన్ ట్యాబ్లెట్లు: డబ్ల్యూహెచ్వో
కరోనా వల్ల తీవ్రంగా ఆరోగ్యం క్షీణించిన వారికి డెక్సామెథసోన్ ట్యాబ్లెట్లు: డబ్ల్యూహెచ్వో
By: chandrasekar Thu, 18 June 2020 1:36 PM
ప్రపంచాన్ని వణికిస్తున్న
కరోనా కోరల్లో చిక్కి చివరి దశకు చేరుకున్న వారికి ఊపిరిపోసే ముచ్చట. కరోనా వల్ల
తీవ్రంగా ఆరోగ్యం క్షీణించిన వారికి డెక్సామెథసోన్ ట్యాబ్లెట్లు ఇస్తే బతుకుతారని
డబ్ల్యూహెచ్వో గుర్తించింది. అయితే, కరోనా వల్ల తీవ్రంగా ఆరోగ్యం క్షీణించిన వారికి
మాత్రమే ఈ ట్యాబ్లెట్లు పనిచేస్తాయని, సాధరణ స్థితిలో ఉన్న కరోనా రోగులపై ఇవి ఎలాంటి
ప్రభావాన్ని చూపడం లేదని ఆ సంస్థ
తెలిపింది. డెక్సామెథసోన్ కొవిడ్ రోగుల ప్రాణాలను రక్షించే శాస్త్రీయ పురోగతిగా
డబ్ల్యూహెచ్వో అభివర్ణించింది.
బ్రిటన్ వైద్యులు కరోనా
పాజిటివ్గా తేలి చివరి దశలో వెంటిలేటర్ మీదున్న రోగులకు డెక్సామెథసోన్ అనే
స్టెరాయిడ్ ట్యాబ్లెట్ ఇవ్వగా, వారు కోలుకున్నారు. అలాగే, రోగులకు
ఈ ట్యాబ్లెట్ ఇస్తూ వెంటిలేటర్పై పెడితే మూడింట ఒక వంతు, ఆక్సిజన్
మాత్రమే అందిస్తే ఐదింట ఒక వంతు మరణాల రేటు తగ్గుతున్నదని వారు తేల్చారు. ఆక్సిజన్, వెంటిలేటర్
ఉపయోగిస్తూ ట్యాబ్లెట్ ద్వారా కొవిడ్ మరణాల రేటును తగ్గిస్తున్న మొదటి చికిత్స
ఇదేనని డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ పేర్కొన్నారు. ‘ఇది
మంచి వార్త. ప్రాణాలను రక్షించే ఈ శాస్త్రీయ పురోగతిలో పాలుపంచుకున్న యూకే
ప్రభుత్వంతోపాటు ఆక్స్ఫర్డ్ వర్సిటీ, దేశంలోని దవాఖాన వైద్యులు, రోగులను
అభినందిస్తున్నా.’ అని ఆయన తెలిపారు.
దీనిపై తమ ప్రతినిధులు
దృష్టిసారించారని, ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను త్వరలో విడుదల
చేస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇదిలా ఉండగా, డెక్సామెథసోన్
అనేది ఒక స్టెరాయిడ్. దీన్ని నొప్పుల నివారణకు 1960వ దశకం నుంచి
వాడుతున్నారు. ఇది 1977 నుంచి డబ్ల్యూహెచ్వో అత్యవసర మందుల జాబితాలో
కొనసాగుతున్నది. దీనికి ఎలాంటి పేటెంట్ లేదు. చాలా దేశాల్లో అందుబాటు ధరల్లోనే లభిస్తున్నది.