అంతర్జాతీయ సదస్సుకు తయారవుతున్న పరిశ్రమలశాఖ...
By: chandrasekar Tue, 15 Dec 2020 4:10 PM
కరోనా ఇతివృత్తంగా
అంతర్జాతీయ సదస్సు బయో ఏషియాను నిర్వహించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ నిర్ణయించింది.
ఫిబ్రవరి రెండో వారంలో హెచ్ఐసీసీలో మూడు రోజులపాటు నిర్వహించనున్నారు. విదేశీ ప్రతినిధులు
అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలు ఉండటంతో
వర్చువల్ విధానంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. భారత ప్రతినిధులు
సదస్సుకు నేరుగా పాల్గొనబోతున్నారు. రాష్ట్రానికి ఇప్పటికే లైఫ్ సైన్సెస్, ఫార్మా
రంగానికి ఉన్న సానుకూలతల దృష్ట్యా మరిన్ని పెట్టుబడులు తీసుకురావడానికి బయోఏషియాను
వేదికగా మలుచుకొనేందుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.
లైఫ్ సైన్సెస్ రంగంలో
ఇటీవల కాలంలో వచ్చిన మార్పులు, ఇంకా రావాల్సినవి ప్రజల అవసరాలు తదితర అంశాలపై ప్రపంచ
స్థాయి శాస్త్రవేత్తలతోపాటు నిపుణులు ప్రసంగించనున్నారు. ప్రపంచంలోని అనేక దేశాలు
కరోనా కారణంగా వ్యాక్సిన్ కోసం భారతదేశం కోసం ఎదురు చూస్తున్నాయి. కరోనా
వ్యాక్సిన్ను ఏ దేశం కనుగొన్నా తయారు చేసే సామర్థ్యం తెలంగాణకు ఉన్నది. దీనికోసం
విదేశాలకు చెందిన పలు సంస్థలు తెలంగాణలోని వివిధ సంస్థలతో ఒప్పందం కూడా
చేసుకున్నాయి. ఇప్పటికే ప్రధానమంత్రి
నరేంద్రమోదీ, ప్రపంచంలో 60కిపైగా దేశాల రాయబారులు జీనోమ్వ్యాలీలోని భారత్
బయోటెక్, బయోలాజికల్
ఈ సంస్థలను సందర్శించారు.
కరోనా నేపథ్యంలో
ప్రపంచానికి అవసరమైన మందుల సరఫరా, వ్యాక్సిన్ తయారీ ఇక్కడినుంచే అయినందున ఆ
ప్రత్యేకతను కాపాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచంలోని వివిధ
దేశాలకు అనేక రకాల వ్యాక్సిన్లు రాష్ట్రం నుంచి ఎగుమతి అవుతున్నాయి. వీటన్నంటి
నేపథ్యంలో ప్రపంచం రాష్ట్రం వైపు చూస్తున్నది. మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే
విధంగా ఈ అంతర్జాతీయ సదస్సును వినియోగించుకోవాలని ఐటీ, పరిశ్రమలశాఖ
మంత్రి కే తారక రామారావు అధికారులకు సూచనలు చేశారు. ఫార్మా పరిశ్రమల కోసం ఫార్మా
సిటీ భూసేకరణ తుది దశకు చేరింది. త్వరలో కంపెనీలకు భూములు కేటాయించేందుకు కసరత్తు
చేస్తున్నారు.