రక్షణ శాఖ కీలక నిర్ణయాలు
By: chandrasekar Thu, 16 July 2020 12:43 PM
చైనా, పాకిస్థాన్
దేశాలకు దీటుగా బదులిచ్చేలా భారత భద్రతా దళాలు అన్ని విధాలా సిద్ధమవుతున్నాయి.
అమ్ములపొదిలో సరికొత్త అస్త్రాలను చేర్చుకోనున్నాయి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం
సైన్యానికి తగిన స్వేచ్ఛ ఇచ్చింది.
రూ.300 కోట్ల
వరకు ఆయుధ సామగ్రిని కొనుగోలు చేసుకొనే అధికారాన్ని సైన్యానికి కట్టబెట్టింది. ఈ
పరిమితి వరకు కొనుగోళ్లకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని బుధవారం స్పష్టం చేసింది. రక్షణ
శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ లడఖ్ పర్యటనకు ముందు ఈ కీలక ప్రకటన వెలువడటం గమనార్హం.
చైనాతో ఉద్రిక్త
పరిస్థితులు నెలకొన్న తూర్పు లఢఖ్ ప్రాంతంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జులై 17న
పర్యటించనున్నారు. సైన్యాధ్యక్షుడు నరవణెతో కలిసి ఆయన పర్యటిస్తారు. ఈ నేపథ్యంలో
బుధవారం రక్షణ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది.
రాజ్నాథ్ నేతృత్వంలో
బుధవారం రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అత్యవసర
కార్యక్రమాల కోసం ఆయుధాలు కొనుగోలు చేసుకొనే ప్రత్యేక అధికారాన్ని సైన్యానికి
కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారు. రూ.300 కోట్ల వరకు ఎన్ని ఒప్పందాలైనా కుదుర్చుకోవచ్చని
సైన్యానికి తెలిపారు.
ఈ నిర్ణయం వల్ల ఆయుధాల
దిగుమతి కాలం ఏడాది కంటే తగ్గుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ ట్వీట్ చేశారు.
లడఖ్తో పాటు చైనా, పాక్ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతపై సమావేశంలో
సమీక్షించారు. సైన్యాన్ని మరింత పటిష్టంగా మార్చాల్సిన అవసరముందని తెలిపారు.