భౌగోళిక స్వరూపాన్ని ప్రమాణికంగా పల్నాడు జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్
By: chandrasekar Fri, 24 July 2020 5:09 PM
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా
జిల్లాల పునర్విభజనకు మంత్రివర్గం ఆమోదించటంతో పల్నాడు జిల్లా ఏర్పాటు ఎక్కడన్న
దానిపై ఆసక్తి నెలకొంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు
చేయాలనే యోచనలో ఉంది ప్రభుత్వం. దీంతో గుంటూరు జిల్లాలోని నరసరావుపేటను కొత్త
జిల్లా కేంద్రంగా మారుస్తారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే పల్నాడు జిల్లా
ఏర్పాటు వెనుకబడ్డ ప్రాంతంలోనే జరగాలన్న డిమాండ్ అనూహ్యంగా తెరపైకి వచ్చింది.
నరసరావుపేట పార్లమెంట్
నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలున్నాయి. వీటిలో నరసరావుపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు
నియోజకవర్గాలు అభివృద్ధి చెందిన గుంటూరుకు సమీపంలో ఉండగా వెనకబడ్డ గురజాల, మాచర్ల, వినుకొండ
నియోజకవర్గాలు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.
దశాబ్దాలుగా విద్య వైద్యం
ఉపాధి కల్పలనలో ఈ నియోజకవర్గాలు వెనుక బడ్డాయి. సాగర్ తీరం చెంతనే చెప్పుకోదగిన
అభివృద్ధి జరగలేదు. పరిశ్రమల ఏర్పాటు పరిపాలన సౌలభ్యం మౌలిక వసతుల లేమితో
వెనకబాటుతనాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే పల్నాడు జిల్లా వెనకబడ్డ
ప్రాంతంలోనే ఏర్పాటు చేయడం చరిత్రక అవసరమన్నారు ఆ ప్రాంత వాసులు.
పల్నాడు జిల్లా ఏర్పాటు
ప్రతిపాదనలు తెరపైకి రాగానే ఇప్పుడు గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా సాధన ఉద్యమం
మొదలైంది. పార్లమెంట్ నియోజకవర్గ ప్రాతిపదికన కాకుండా భౌగోళిక స్వరూపాన్ని
ప్రమాణికంగా పల్నాడు జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు స్ధానికులు.
గురజాల, మాచర్ల, వినుకొండ
నియోజకవర్గాల పరిధిలోనే జిల్లా ఏర్పాటు చేయాలని పట్టుబడుతున్నారు. ఈ ప్రక్రియ
వస్తేనే వెనకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి న్యాయం జరుగుతుందని ఈ దిశగానే ప్రభుత్వం
నిర్ణయం ఉండాలని డిమాండ్లు వస్తున్నాయి.