దేశ రాజధానిలో భారీగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు ...
By: Sankar Wed, 04 Nov 2020 3:56 PM
ఒకవైపు భయంకరమైన కాలుష్యం, మరోవైపు కరోనా వైరస్ మహమ్మారి ఢిల్లీ ప్రజలను బెంబేలెత్తిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో మునుపెన్నడూ లేని విధంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు ఆందోళన రేపుతున్నాయి.
కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య గత కొంత కాలంగా తగ్గుతూ వచ్చినప్పటికీ, మళ్లీ పెద్ద సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా అంగీకరించారు. పండుగ సీజన్, పెరుగుతున్న కాలుష్యంతో కేసులు సంఖ్య అకస్మాత్తుగా పెరిగినట్టు తెలుస్తోంది.
ఢిల్లీలో కోవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతోందని, ఈ విస్తరణను థర్డ్ వేవ్గా చెప్పవచ్చని ఆయన పేర్కొన్నారు. కేసుల సంఖ్య పెరుగుతుండంతో ఢిల్లీ అధికార యంత్రాంగం అప్రమత్తమైందని సీఎం కేజ్రివాల్ తెలిపారు. పరిస్థితిని తాము ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు. మునుపటిలా కొత్త కేసులు విజృంభించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మహమ్మారి వ్యాప్తి తరువాత తొలిసారిగా డిల్లీలో 6వేలను దాటేసాయి. రోజువారీ కేసుల సంఖ్య 6000 మార్కును దాటడం ఇదే మొదటిసారి. తాజా 6,700 కరోనా కేసులతో మొత్తం సంఖ్య 4 లక్షలను అధిగమించింది. అంతకుముందు అత్యధిక కేసులు అక్టోబర్ 30 న (5,891) నమోదయ్యాయి.