ఢిల్లీ ఆరోగ్య మంత్రికి కరోనా పాజిటివ్
By: Sankar Wed, 17 June 2020 9:22 PM
ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. తీవ్ర జ్వరంతో బాధ పడుతున్న ఆయనకు వైద్యులు బుధవారం ఉదయం రెండోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. సాయంత్రం వచ్చిన ఫలితాల్లో ఆయనకు కరోనా సోకినట్లుగా తేలింది. మొదటిసారి చేసిన పరీక్షలో ఆయనకు కరోనా నెగటివ్గా వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా పాజిటివ్ రావడంతో ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. వైద్యులు ఆయనకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.
కొద్ది రోజులుగా జ్వరంతో బాధ పడుతున్న సత్యేంద్ర జైన్ చికిత్స కోసం సోమవారం ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరారు. నాటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు.జ్వరంతో పాటు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న మంత్రి సత్యేంద్ర జైన్కు వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభణ, పరిస్థితులపై చర్చించేందుకు సోమవారం జరిగిన అఖిలపక్ష సమావేశానికి మంత్రి సత్యేంద్ర జైన్ హాజరయ్యారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆందోళన నెలకొంది.