ఆర్సీబిని ఓడించి దర్జాగా ప్లే ఆఫ్ కు చేరిన ఢిల్లీ క్యాపిటల్స్
By: Sankar Tue, 03 Nov 2020 05:40 AM
ఐపీయల్ 2020 లీగ్ మ్యాచ్ లు చివరి దశకు చేరుకున్నాయి..ఇప్పటికే ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్ కు చేరగా , నిన్న రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ , ఆర్సీబి జట్లు కూడా ఫలితంతో సంబంధం లేకుండ ప్లే ఆఫ్ కు చేరుకున్నాయి...ఇక మిగిలిన ఒక్క స్థానం కోసం కేకేఆర్ , సన్ రైజర్స్ పోటీపడుతున్నాయి...
ఇక ఢిల్లీ తమ పరాజయాల పరంపరకు అవసరమైన దశలో చెక్ పెట్టింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో (ఆర్సీబీ) కీలకమైన ఈ మ్యాచ్లో గెలిచి ముంబై సరసన నిలిచింది. దీంతో పాయింట్ల పట్టకిలో టాప్–2లో నిలిచిన ఈ రెండు జట్లకు ప్లే ఆఫ్స్లో ఒక మ్యాచ్లో ఓడినా... ఫైనల్ చేరేందుకు రెండో దారి (క్వాలిఫయర్–2) ఉంటుంది. ఈనెల 5న జరిగే తొలి క్వాలిఫయర్లో ముంబై ఇండియన్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడుతుంది. 6న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో బెంగళూరుతో తలపడే ప్రత్యర్థి కోల్కతానా, హైదరాబాదా నేడు తేలుతుంది.
సోమవారం జరిగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు వికెట్ల తేడాతో బెంగళూరుపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. దేవ్దత్ పడిక్కల్ (41 బంతుల్లో 50; 5 ఫోర్లు) రాణించాడు. డివిలియర్స్ (21 బంతుల్లో 35; 1 ఫోర్, 2 సిక్స్లు) ధాటిగా ఆడాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ నోర్జే 3 వికెట్లు తీయగా...రబడ ఖాతాలో రెండు వికెట్లు పడ్డాయి. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 4 వికెట్లకు 154 పరుగులు చేసి గెలిచింది. ఒకవేళ ఢిల్లీ జట్టు లక్ష్యాన్ని 17.3 ఓవర్లలోపే ఛేదించి ఉంటే కోల్కతా నైట్రైడర్స్ రన్రేట్ కంటే బెంగళూరు జట్టుది తక్కువ అయ్యేది.