సైనికుల త్యాగాలు ఎప్పటికి స్ఫూర్తినిస్తూనే ఉంటాయి ..రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
By: Sankar Sun, 26 July 2020 11:41 AM
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమరవీరులకు నివాళులర్పించారు. కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి 21 ఏండ్లు పూర్తయిన సందర్భంగా భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్గిల్ విజయాన్ని అందించిన సైనికుల బలిదానం ఎల్లప్పుడూ మనకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని ట్వీట్ చేశారు.
కార్గిల్ అనేది కేవలం ఆత్మగౌరవానికే సంకేతం కాదని, అన్యాయానికి వ్యతిరేకంగా తీసుకున్న చర్య అని తెలిపారు. భారతదేశ స్థిరమైన నాయకత్వానికి ప్రతీక అని, యావత్ దేశం గర్వించదగిన విషయం అని చెప్పారు. అత్యంత ఎత్తయిన కొండల నుంచి శత్రువును తరిమివేసి, అక్కడ త్రివర్ణ పతాకాన్ని మళ్లీ ఎగురవేసిన సైనికులకు సెల్యూట్ చేస్తున్నాని వెల్లడించారు. జాతీయ భద్రత పరిధిలో మన ప్రతిఅడుగూ ఆత్మ రక్షణ కోసమేనని, దాడి ఎంతమాత్రం కాదని మాజీ ప్రధాని వాజ్పేయి తరచూ చెప్పేవారని ఆయన గుర్తుచేశారు..
ఇక కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా సైనికుల త్యాగాలను ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. దేశాన్ని సుస్థిరంగా రక్షించిన సాయుధ దళాల ధైర్యం, సంకల్పం మరవలేనిది అని మోదీ ట్వీట్ చేశారు. సైనికుల శౌర్యం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉందని ప్రధాని పేర్కొన్నారు.
కాగా భారత్పై దురాక్రమణకు పాల్పడిన పాకిస్థాన్పై 1999, జూలై 26న భారత సైన్యం విజయం సాధించింది. సైనికుల విజయానికి గుర్తుగా ప్రతిఏడాది విజయ్ దివస్ను నిర్వహిస్తున్నారు..