లారాతో మాట్లాడకుండా ఉంటే వెంటనే అవుట్ అవుతాడు ..టీమిండియా మాజీ కీపర్
By: Sankar Thu, 18 June 2020 12:46 PM
సాధారణంగా ప్రత్యర్థి బ్యాట్స్మెన్ని బోల్తా కొట్టించాలంటే ఆటగాళ్లు స్లెడ్జింగ్కి దిగుతుంటారు. ఆ క్రమంలో నోరు జారడం, కవ్వింపులకి దిగడం ద్వారా బ్యాట్స్మెన్ ఏకాగ్రతని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంటారు. కానీ.. 2002లో వెస్టిండీస్ పర్యటనకి వెళ్లిన టీమిండియా.. ఆ దేశ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారాని మౌన వ్యూహంతో బోల్తా కొట్టించింది. అప్పటి వరకూ సూపర్ ఫామ్లో ఉన్న లారా.. భారత క్రికెటర్లు అనుసరించిన వ్యూహానికి సిరీస్లో 28.85 సగటుతో 202 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆ సిరీస్లో అతని అత్యధిక స్కోరు 55 పరుగులే కావడం విశేషం.
ఆ సిరీస్లో తాను చెప్పిన ఐడియాతోనే బ్రియాన్ లారాని టీమిండియా కట్టడి చేయగలిగిందని మాజీ క్రికెటర్ దీప్ దేశ్గుప్తా వెల్లడించాడు. ‘‘వెస్టిండీస్తో 2002లో గయానా టెస్టుకి ముందు జరిగిన టీమ్ మీటింగ్లో బ్రియాన్ లారాని కట్టడి చేయడంపై చర్చ జరిగింది. టీమ్లో కొంత మంది కొన్ని వ్యూహాలు చెప్పారు. నా వంతుగా నేను ‘లారాతో మ్యాచ్ టైమ్లో ఎవరూ మాట్లాడొద్దు’ అని చెప్పా. దాంతో అర్థంకానట్లు అందరూ నావైపు చూశారు. ‘అవును లారా బ్యాటింగ్ చేసే సమయంలో ఎవరూ అతనితో మాట్లాడకపోతే అతనికే బోర్ కొట్టి ఔటైపోతాడు’ అని చెప్పా. ఆ వ్యూహం ప్రకారం మ్యాచ్లో లారా మాతో మాట్లాడే ప్రయత్నం చేసినా మేము మిన్నకుండిపోయాం. ముఖ్యంగా.. స్పిన్నర్ల బౌలింగ్లో బంతిని ఎదుర్కొన్న తర్వాత రాహుల్ ద్రవిడ్, నాతో మాట్లాడేందుకు మావైపు లారా తిరిగాడు. కానీ.. మేము లారా వైపు చూడకుండా చూపు తిప్పుకున్నాం’’ అని దేశ్గుప్తా వెల్లడించాడు.
ఫస్ట్ టెస్టులో 37 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న భారత్ జట్టు.. ఆ తర్వాత వరుసగా బార్బడోస్, జమైకా టెస్టులో ఓడిపోయింది. దాంతో.. 2-1 తేడాతో టీమిండియాకి సిరీస్ చేజారగా.. దేశ్గుప్తాకి కూడా అదే ఆఖరి సిరీస్ కావడం గమనార్హం.