ఆంధ్రప్రదేశ్లో తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ కేసులు
By: chandrasekar Tue, 22 Sept 2020 11:46 AM
ఆంధ్రప్రదేశ్లో తూర్పు, పశ్చిమ
గోదావరి జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కరోనా శాంతించినట్లు
కనిపిస్తోంది. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం
చేస్తోంది. ఈ ఒక్క జిల్లాలోనే ప్రతి రోజూ వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి.
అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డిశ్చార్జిలు కూడా పెరిగాయి. సోమవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య
శాఖ విడుదల చేసిన బులిటెన్లో గడిచిన 24 గంటల్లో 56,569 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 6,232
మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్
కేసులు 6,31,749కు చేరుకున్నాయి. అలాగే రాష్ట్రంలో కరోనా వైరస్ మరణాలు కూడా బాగా
తగ్గాయి. కరోనా బారినపడి మరణించిన వారి
సంఖ్య సోమవారానికి 51కి
తగ్గింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య 5,410కు
చేరుకుంది.
కరోనా మహమ్మారి బారిన పడి
గడిచిన 24
గంటల్లో కృష్ణా జిల్లాలో 9 మంది, చిత్తూరులో ఏడుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, అనంతపురంలో
ఐదుగురు, తూర్పు
గోదావరిలో నలుగురు, గుంటూరులో నలుగురు, నెల్లూరులో నలుగురు, పశ్చిమ
గోదావరిలో నలుగురు, కర్నూలులో ముగ్గురు, కడపలో ఇద్దరు, ప్రకాశంలో
ఇద్దరు, శ్రీకాకుళంలో
ఒకరు మృత్యువాత పడ్డారు. గత కొన్ని రోజులుగా డిశ్చార్జిలు కూడా ఏపీలో భారీగా
పెరుగుతున్నాయి. సోమవారం 10,502 మంది కరోనా మహమ్మారిని పూర్తిగా జయించి డిశ్చార్జి
అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం 6,31,749 పాజిటివ్ కేసులకు గాను,
5,51,821 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం
74,518 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక తూర్పు, పశ్చిమ
గోదావరి జిల్లాల్లో కరోనా వైరస్ మహమ్మారి చెలరేగిపోతోంది. తూర్పు గోదావరిలో 87,769 మందికి, పశ్చిమ గోదావరి జిల్లాలో 58,708 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది.