ఇరాక్ లో దయనీయ స్థితిలో తెలంగాణ కార్మికుడి మరణం
By: chandrasekar Sat, 11 July 2020 5:02 PM
ఇరాక్ లో ఓ రాష్ట్రానికి
చెందిన కార్మికుడు దయనీయ పరిస్థితుల్లో తనువు చాలించాడు. తినడానికి తిండి కూడా
లేని పరిస్థితుల్లో ఆకలితో అలమటించి చనిపోయాడు. కుటుంబ పోషణ కోసం అయిన వారికి
దూరంగా ఇతర దేశాలకు వలస వెళ్తున్న వారి పరిస్థితి దుర్భరమవుతోంది. డబ్బుల సంపాదనలో
తమ ప్రాణాలను కోల్పోతున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాకు చెందిన
పర్యామోల భోజన్న (46). కొన్నాళ్లుగా
ఇరాక్ లోని ఎర్బిల్ పట్టణంలో చిక్కుకుపోయాడు. విదేశాల్లో పని చూపిస్తానని ఓ ఏజెంట్
చెప్పడంతో నమ్మి మోసపోయాడు. ఆ ఏజెంట్ ఉద్యోగం ఇప్పించకపోవడంతో అక్కడే రాష్ట్రానికి
చెందిన ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులతో కలిసి కార్మికుడిగా పనిచేస్తున్నాడు.
కరోనా వ్యాప్తితో లాక్
డౌన్ విధించడంతో భోజన్న, తదితర
తెలంగాణ కార్మికులకు ఉపాధి కరవైంది. వారందరూ తమను స్వదేశానికి తీసుకొచ్చే
ఏర్పాట్లు చేయాలని ఓ వీడియో ద్వారా కోరారు. ఉపాధి లేకపోవడంతో తినడానికి తిండి కూడా
కరవై భోజన్నచనిపోయాడు. జూన్ 29 నుంచి
అతడి మృతదేహం ఎర్బిల్ లోని ఓ ఆస్పత్రి మార్చురీలో ఉంది. ఎలాగైనా తన భర్త
మృతదేహాన్ని స్వస్థలం తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ భార్య లక్ష్మి అందరినీ
వేడుకుంటోంది. తెలంగాణ కార్మికుడి మృతి గురించి ఎర్బిల్ లోని భారత కాన్సులేట్
అధికారులతో మాట్లాడామన్నారు తెలంగాణ గల్ఫ్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్
అధ్యక్షుడు పట్కూరి బసంత్ రెడ్డి. వందేభారత్ మిషన్ లో భాగంగా విదేశాలకు వస్తున్న
భారత విమానాల్లో భోజన్న మృతదేహం తరలించే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.