తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటవాసి కల్నల్ సంతోష్ మృతి
By: chandrasekar Wed, 17 June 2020 09:03 AM
భారత్ - చైనా
సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో భారత్ - చైనా సైనిక బలగాల మధ్య ఘర్షణలో మరణించిన
ముగ్గురిలో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటవాసి ఒకరున్నారు. సూర్యాపేట విద్యానగర్కు చెందిన కల్నల్ సంతోష్ బాబు
పదిహేనేళ్లుగా సైన్యంలో పనిచేస్తున్నారు. ఏడాదిన్నరగా చైనా సరిహద్దులో
పనిచేస్తున్నారు. 16-బిహార్ రెజిమెంట్కు చెందిన ఆయన మృతి చెందినట్లు
కుటుంబీకులకు సైనికాధికారులు సమాచారం అందించారు.
సంతోష్కు భార్య సంతోషి, కుమారుడు
అభిజ్ఞ(9), అనిల్(4) ఉన్నారు.
డిల్లీలో ఉంటున్న సంతోష్ భార్యకు భారత సైన్యం నుంచి సమాచారం అందగా తమకు సోమవారం
మధ్యాహ్నం తెలిపిందని సంతోష్ తల్లి మంజుల చెప్పారు.
సంతోష్ బాబు ప్రాథమిక
విద్యాభ్యాసం సూర్యాపేటలోనే సాగింది. 6 నుంచి 12 తరగతులు విజయనగరం జిల్లా కోరుకొండలోని సైనిక
స్కూలులో చదివారని తల్లిదండ్రులు మంజులు, ఉపేందర్లు చెప్పారు.పుణెలోని ఎన్డీయేలో డిగ్రీ, అనంతరం
డెహ్రడూన్ ఐఎంఏలో పీజీ చదివారని తెలిపారు. ఆదివారం రాత్రి తమతో మాట్లాడి క్షేమ
సమాచారం పంచుకున్నారని ఆందోళన చెందవద్దని
చెప్పారని తల్లిదండ్రులు తెలిపారు.
తమిళనాడులోని
రామనాథపురానికి చెందిన పళని(40)
కూడా ఈ ఘటనలో మరణించినట్లు పళని సోదరుడు తెలిపారు.
భారత్ - చైనా
సరిహద్దులోని గాల్వన్ వ్యాలీలో భారత్ - చైనాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే క్రమంలో
సోమవారం రాత్రి హింసాత్మక ఘర్షణ జరిగిందని ఇరువైపులా ప్రాణ నష్టం జరిగిందని భారత
సైన్యం ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఈ ఘర్షణలో భారత సైన్యానికి చెందిన ఒక
అధికారితో పాటు ఇద్దరు జవాన్లు చనిపోయారని చెప్పింది.
చైనా సైనికులు కూడా ఈ
ఘటనలో మృతిచెందినట్లు వార్తలు వస్తున్నప్పటికీ ఎంతమంది చనిపోయారన్నది ఇంకా
స్పష్టంగా తెలియలేదు. చైనాతో ఘర్షణలో తమ సైనికులు చనిపోయారని భారత సైన్యం చెప్పటం
గురించి చైనా విదేశాంగ మంత్రిత్వశాఖను ప్రశ్నించగా భారతదేశం ఏకపక్ష చర్యలు
చేపట్టరాదని, ఇబ్బందులను పెంచరాదని చైనా స్పందించినట్లు రాయిటర్స్
వార్తా సంస్థ తెలిపింది.
చైనా సైన్యం వైపు ఎంతమంది
సైనికులు చనిపోయారని కానీ గాయపడ్డారని కానీ స్పష్టమైన సమాచారం ఏదీ లేదు. భారత
సైన్యం సరిహద్దు దాటి వచ్చిందని చైనా సైనికుల మీద దాడి చేసిందని చైనా
ఆరోపించినట్లు ఏఎఫ్పీ వార్తా సంస్థ చెప్పింది. భారత సైన్యం ప్రధాన కార్యాలయం
జారీచేసిన ప్రకటన ప్రకారం ఇరు దేశాల సైన్యాలకు చెందిన సీనియర్ అధికారులు ఘర్షణ
జరిగిన ప్రాంతంలో సమావేశమై సమస్యను పరిష్కరించటానికి ప్రయత్నిస్తున్నారు.