చావు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా అతడి చెంతకు చేరలేకపోయింది....
By: chandrasekar Mon, 23 Nov 2020 6:49 PM
ఎన్ని ప్రమాదాలు ఎదురైనా
ఆ వ్యక్తి క్షేమంగా బయట పడ్డాడు. కరోనా, డెంగీ, మలేరియా సోకి కోలుకున్న అతడు మరోసారి విషపూరితమైన
పాము కాటుకు బలైనా, ఎలాంటి ప్రమాదం లేకుండా కోలుకున్నాడు. ఇన్నిసార్లు
చావుకు దగ్గరగా వెళ్లి వచ్చిన ఆ అదృష్టవంతుడి పేరు ఇయాన్ జోన్స్. అతడు ఒక బ్రిటీష్
ఛారిటీ సంస్థ తరఫున పనిచేస్తున్నాడు. ఇటీవల రాజస్థాన్లోని జోధ్పూర్ జిల్లాలో
ఇయాన్ ప్రాణాంతకమైన త్రాచుపాము కాటుకు గురయ్యాడు. దీంతో స్థానికులు అతడిని జోధ్పూర్లోని
ఒక ప్రైవేటు హాస్పిటల్లో చేర్పించారు. ఇది జైపూర్ నుంచి 350
కిలోమీటర్ల (220 మైళ్లు) దూరంలో ఉంది. జోధ్పూర్ జిల్లాలోని ఒక
గ్రామంలో పాము కాటుకు గురైన ఇయాన్ జోన్స్ గత వారం తమ హాస్పిటల్లో చేరినట్లు
అతడికి చికిత్స చేసిన డాక్టర్ అభిషేక్ టాటర్ తెలిపారు. అంతకు ముందు ఇయాన్కు
రెండుసార్లు కరోనా పాజిటివ్ వచ్చిందని, చికిత్స అనంతరం కోలుకున్నాడని ఆయన పేర్కొన్నారు.
"హాస్పిటల్కు వచ్చినప్పుడు ఇయాన్ స్పృహలోనే ఉన్నాడు. కానీ కంటి చూపు
మసకబారడం, నడవడానికి
ఇబ్బంది పడటం వంటి పాము కాటు లక్షణాలను గుర్తించాం. వెంటనే చికిత్స అందించాం"
అని టాటర్ శనివారం ఒక వార్తాసంస్థతో చెప్పాడు.
గత వారం ఇయాన్ డిశ్చార్జ్
అయ్యాడు. స్థానిక గ్రామాల్లో పాము కాటు సాధారణ విషయమని, ఇలాంటి
కేసులు తరచుగా వస్తుంటాయని డాక్టర్ అభిషేక్ అంటున్నారు. ఇండియాకు వచ్చిన తరువాత తన
తండ్రి అనేక అనారోగ్యాల బారిన పడి ఒక యోధుడిలా వాటితో పోరాటం చేశాడని ఇయాన్
కుమారుడు సెబ్ జోన్స్ చెప్పారు. కరోనాకి ముందు ఇయాన్ మలేరియా, డెంగీ
జ్వరాలతో బాధపడ్డాడని అతడు తెలిపాడు. వైద్య చికిత్స ఖర్చులు చెల్లించడానికి, వారు
ఇంగ్లండ్ వెళ్లేందుకు అవసరమైన డబ్బును గో ఫండ్ మి (GoFundMe) క్యాంపెయిన్ ద్వారా
సేకరించారు. ఇయాన్ ఎప్పుడో తమ దేశానికి వెళ్లాల్సి ఉంది. కానీ మహమ్మారి కారణంగా
అతడు ఇంటికి వెళ్లలేకపోయాడు. ఇయాన్ ఎంతోమంది స్థానిక హస్తకళాకారులకు ఉపాధి మార్గం
చూపాడు. రాజస్థాన్లోని సంప్రదాయ హస్తకళాకారులు తయారు చేసే ఉత్పత్తులను అతడు
ఇంగ్లండ్కు ఎగుమతి చేస్తాడు. ఇందుకు సబీరియన్ (Sabirian) అనే స్వచ్ఛంద, సామాజిక
సంస్థను నెలకొల్పాడు. స్థానికులను పేదరికానికి దూరం చేసి, వారికి
ఉపాధి కల్పించడానికి ఇయాన్ ఎంతో కృషి చేస్తున్నాడు.