ఆస్తిలో కూతుళ్ళకు కూడా సమాన హక్కు ..సుప్రీమ్ కోర్ట్ సంచలన తీర్పు
By: Sankar Tue, 11 Aug 2020 3:04 PM
తల్లిదండ్రుల ఆస్తిలో ఆడపిల్లలకు సమాన వాటాపై దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఆడపిల్లలకు ఆస్తిలో హక్కు కల్పించడంపై దాఖలైన వేర్వేరు పిటిషన్లపై విచారణ అనంతరం సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. హిందూ వారసత్వ సవరణ చట్టం-2005 అమల్లోకి వచ్చిన నాటికి తల్లిదండ్రి జీవించి ఉన్నా, లేకున్నా ఆడపిల్లలకు వారి ఆస్తులపై కొడుకులతో సమానంగా హక్కు ఉంటుందని తేల్చిచెప్పింది.
1956 నాటి హిందూ వారసత్వ చట్టానికి 2005లో సవరణలు చేశారు. 2005 సెప్టెంబర్ 9న ఆ చట్టానికి భారత పార్లమెంట్ ఆమోదం తెలిపింది. తండ్రి సంపాదించిన ఆస్తిలో ఆడబిడ్డలకు సమాన హక్కు ఉంటుందని ఆ చట్టంలో పేర్కొన్నారు. హిందూ వారసత్వ చట్టంలో సవరణలు చేపట్టే నాటికే కుటుంబంలో ఉన్న ఆడపిల్లలకు కూడా కొత్త చట్టం వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.
జస్టిస్ అరుణ్ మిశ్రా సారథ్యంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ సంచలన తీర్పు వెల్లడించింది. ధర్మాసనంలో జస్టిస్ అరుణ్ మిశ్రాతోపాటు జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ ఎంఆర్ షా సభ్యులుగా ఉన్నారు. కుమార్తె జీవితాంతం తండ్రిని ప్రేమిస్తూనే ఉంటుందని జస్టిస్ మిశ్రా వ్యాఖ్యానించారు. ప్రకాశ్ వర్సెస్ ఫులావతి కేసులో తుది తీర్పు సందర్భంగా న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు..