కరోనా సోకింది అని తల్లిని ఇంట్లోకి రానివ్వని కూతురు..
By: Sankar Sat, 29 Aug 2020 3:06 PM
కరోనా కారణంగా మానవ సంబంధాలు దారుణంగా దెబ్బతింటున్నాయి..కరోనా సోకిందని ఓ కూతురు తన తల్లిని ఇంట్లోకి రానివ్వకుండా చెట్టు కొమ్మలు అడ్డు వేసుకుంది. దీంతో ఆ తల్లి రాత్రంతా చలికి వణుకుతూ, ఆకలితో చెట్టుకిందే గడిపింది. వృద్ధురాలి దీనస్థితిని శుక్రవారం ఉదయం స్థానికులు గ్రామ సర్పంచ్కి వివరించారు. వెంటనే స్పందించిన ఆయన వృద్ధురాలిని ఇంట్లోకి రానివ్వాలని కుమార్తెకు చెప్పినా ఆమె ఒప్పుకోలేదు. కుమారులను సంప్రదించినా ససేమిరా అనడంతో సర్పంచ్ చొరవ తీసుకుని అక్కడే తాత్కాలిక ఆశ్రయం కల్పించి భోజనం పెట్టారు.
స్థానిక బాబుసాయిపేట రోడ్డులో నివాసం ఉంటున్న ఓ వృద్ధురాలికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కొన్నేళ్ల క్రితం ఆమె భర్త మృతిచెందాడు. అప్పటినుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. ఉన్న ఆస్తిపాస్తులు పంచుకుని తల్లి ఆలనా పాలనను కుమారులు పట్టించుకోవడం మానేశారు. దీంతో ఆ వృద్ధురాలు కొన్నేళ్లుగా మండల కేంద్రంలోనే ఉంటున్న కుమార్తె వద్ద ఆశ్రయం పొందుతోంది.
కొద్ది రోజులుగా వృద్ధురాలికి అనారోగ్యంగా ఉండడంతో సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవడంతో కరోనా పాజిటివ్ అని తేలింది. ఆ విషయం తెలుసుకున్న కుమార్తె తల్లిని ఇంట్లోకి రానివ్వకుండా చెట్టు కొమ్మలు అడ్డు వేసుకుంది.