పూరీ జగన్నాథ్ కామెంట్స్పై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం
By: chandrasekar Sat, 29 Aug 2020 12:33 PM
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ షూటింగ్స్ లేని కారణంగా ప్రస్తుతం తన ఇంట్లో ఉంటూ పోడ్కాస్ట్ ఆడియోలతో అనేక విషయాలపై తన అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. తాజాగా దేశంలో ఉన్న పేదలు, రిజర్వేషన్లపై సంచలన కామెంట్స్ చేశారు. పేద పిల్లలకు ఉచిత విద్య ఉండకూడదు. రిజర్వేషన్లు కులాన్ని బట్టి ఉండకూడదు. పేదలకు ఓటు హక్కు తీసేయాలి. నిరక్షరాస్యులకు ఓటు హక్కు ఉండకూడదు అంటూ సంచనల వ్యాఖ్యలు చేశారు. అబ్రహం లింకన్, నెల్సన్ మండేలా, స్టీవ్ జాబ్స్, అబ్దుల్ కలాం, రజినీకాంత్ వీళ్లందరూ పేద కుటుంబంలోనే పుట్టారు. పేదోడిగా పుట్టడం తప్పు కాదు. పేదోడిగా చావడమే తప్పు. ఈ దేశంలో గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ స్కీమ్లు తీసుకుని చాలామందికి పేదోడిగా బతకడం అలవాటైపోయింది. గవర్నమెంట్ వాళ్లకి సాయం చేయడం కరెక్ట్ కాదు. అందుకే చిన్న చిన్న మార్పులు రావాలి.
వైట్ కార్డ్ ఉన్న వాళ్లకు ఓటు హక్కు రద్దు చేయాలి. నీ జీవితమే నీకు బరువుగా ఉన్నప్పుడు ఒక లీడర్ జీవితం నీ చేతిలో ఎలా పెట్టమంటావ్ అని అడగాలి. నీకు రేషన్ కార్డ్ కావాలంటే ఓటు హక్కు ఉండదు అని చెప్పాలి. చెప్పే వాడికి ఏది అవసరమో అదే తీసుకుంటారు. అప్పుడు నిజంగా కష్టంలో ఉన్నవాడు వైట్ కార్డ్ తీసుకుంటాడు. ఓటు హక్కు కావాలనుకున్నవాడు దాని కోసం కష్టపడతాడు అని అన్నాడు. రిజర్వేషన్లు కూడా కులాన్ని బట్టి ఇవ్వకూడదు పేదోడు ఏ కులంలో ఉన్నా సపోర్ట్ చేయాలి. వాళ్ల పిల్లలు చదువుకునేలా చేయాలి. బూత్లో ఓటేసే ప్రతి ఒక్కడు అవగాహనతో ఉండాలి. నిరక్షరాస్యులకు ఓటింగ్ తీసేయాలి. ఓటు వేయాలి అంటే మినిమమ్ క్వాలిఫికేషన్ ఉండాలి. అందరూ ఓటు హక్కు సంపాదించుకోవాలి.
ప్రభుత్వాలని, లీడర్స్ని అడుక్కోవడం మానేద్దాం. ప్రపంచంలో ఏ జంతువు మరే జంతువు దగ్గర చేయిచాచదు. తిండి కోసం కష్ట పడుతుంది లేదంటే చస్తుంది. నీ జాతిని తిడితే నీకు కోపం వస్తుంది కదా మరి అదే జాతిని కించపరుస్తూ పేదోడిలా ప్రభుత్వం ముందు నిలబడటం తప్పుకాదా కష్టపడు, నీ జాతి తలెత్తుకునేలా చేయి. మా జాతికి రిజర్వేషన్లు వద్దు. వేరే వాడికి ఇవ్వండి అని చెప్పేలా ఉందాం. ఇండియా అప్పుడు మారుతుంది. కాళ్లు చేతులు బాగున్నప్పుడు మన చేతులు చాచొద్దు అని సంచలన కామెంట్స్ చేశారు. అయితే పూరీ కామెంట్స్పై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.