రుణాలు తీసుకునే విద్యార్థులను టార్గెట్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు....
By: chandrasekar Mon, 16 Nov 2020 11:03 AM
సైబర్ నేరగాళ్లు..
చిన్ని చిన్న రుణాలు తీసుకునే విద్యార్థులను టార్గెట్ చేశారు. ఈ యాప్ల ముసుగులో
మీ ఫోన్లోకి ప్రవేశించి కాంటాక్ట్స్లోని నంబర్లను దొంగిలిస్తున్నారు. ఆ తర్వాత
రుణం తీసుకున్న మూడు రోజుల తర్వాత డబ్బుల కోసం వేధిస్తున్నారు. వీరి బాధను
తట్టుకోలేక ఫోన్ స్విచ్ఛాఫ్ చేసినా సిమ్ చేంజ్ చేసినా మీ కాంటాక్ట్స్లో ఉన్న
వారిని వేధిస్తున్నారు. దీనికితోడు వచ్చిరాని ఆంగ్లంలో లీగల్ నోటీసు అంటూ పంపించి
భయాందోళనకు గురి చేస్తున్నారు.
ఎల్బీనగర్ ప్రాంతానికి
చెందిన టింకు డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. అత్యవసరంగా డబ్బులు అవసరం
పడటంతో చిన్న రుణాలు ఇచ్చే యాప్ను డౌన్లోడ్ చేసుకుని దాదాపు రూ.3 వేలు
తీసుకున్నాడు. అయితే రుణం తీసుకునే ముందు 15 రోజుల్లో తిరిగి ఇచ్చేయాలనే ఒప్పందం ఉంది. అయితే
తీసుకున్న మూడో రోజు నుంచే వడ్డీ ఇంత అయింది. రెండు రోజుల్లో చెల్లించాలి, లేకపోతే
అది మూడింతలు అవుతుందని మెసేజ్లు, ఫోన్లలో బెదిరించారు. ఆందోళన చెందిన టింకు ఫోన్ను
స్విచ్ఛాఫ్ చేశాడు. ఆ మరుసటి రోజు టింకు బంధువు నంబర్కు మెసేజ్ పంపించారు.
అందులో టింకు మీ ఫోన్ నంబర్ను గార్డియన్గా పెట్టి రూ.3 వేల
రుణం తీసుకున్నాడు. అది ఇప్పుడు 12 వేలకు చేరింది. కట్టకపోతే మీపై పోలీసు కేసు
పెడుతామని హెచ్చరించారు. అయితే టింకు బంధువు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు.
మరుసటి రోజు గుర్తు
తెలియని వ్యక్తి ఫోన్ చేసి.. టింకు రుణం మీరు చెల్లించాలి.. లేదంటే కోర్టులో విచారణ ఎదుర్కోవాలని బెదిరించాడు. నేను ఏ రుణం
తీసుకోలేదు మీరు ఏమి చేసుకుంటారో చేసుకోండని జవాబు ఇచ్చాడు. అయితే ఫోన్లో
మాట్లాడిన వ్యక్తి హిందీలో తీవ్ర పదజాలంతో దుర్భాషలాడాడు. ఆ తర్వాత సరిగ్గా పదాలు
లేని ఆంగ్ల భాషలో ఓ లీగల్ నోటీసుకు సంబంధించి మెసేజ్ పంపించాడు. దీంతో భయపడిన
టింకు బంధువు రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రాథమిక
దర్యాప్తులో యాప్ను డౌన్లోడ్ చేసే సమయంలోనే.. ఫోన్ను వారి ఆధీనంలోకి వచ్చే
విధంగా ఏదో వైరస్ లేదా కోడ్ను డౌన్ చేయించినట్లు అనుమానించారు. దీని ఆధారంగా
వారు రుణం తీసుకున్న వ్యక్తి ఫోన్లోని కాంటాక్ట్స్ను చోరీ చేసి .. బెదిరించారని
గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.