సైబరాబాద్ పరిధిలో పెరిగిన నేరాల శాతం
By: Sankar Tue, 29 Dec 2020 1:56 PM
సైబరాబాద్ కమిషనరేట్ వార్షిక నేర గణాంకాలను సీపీ సజ్జనార్ విడుదల చేశారు. ఈ ఏడాది సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 6.65 శాతం నేరాలు పెరిగాయని వెల్లడించారు. రోడ్డు ప్రమాదంలో 22.7 శాతం తగ్గాయి. మహిళలపై 18.6 శాతం, చిన్నారులపై 12.2 శాతం నేరాలు తగ్గినట్లు సీపీ తెలిపారు.
సైబర్ నేరాలు 135 శాతం పెరిగాయని పేర్కొన్నారు. హత్యలు, దోపిడీలు 26 శాతం చొప్పున తగ్గాయన్నారు. హత్యాయత్నం కేసులు 30 శాతం తగ్గగా, అత్యాచారం కేసులు 33 శాతం తగ్గాయని సీపీ స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవహారాల విషయంలో 42 శాతం కేసులు పెరిగాయి. 83 మందిపై పీడీ యాక్టులు నమోదు చేసినట్లు చెప్పారు.
ప్రాపర్టీ కేసులకు సంబంధించి ఈ ఏడాది 19 కోట్ల ఆస్తులను సీజ్ చేసినట్లు సీపీ పేర్కొన్నారు. రోడ్డుప్రమాదాలు తగ్గించేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నామని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.కాగా ఇంతకుముందే హైదరాబాద్ , రాచకొండ కమిషనరేట్ ల పరిధిలో ఆయా కమిషనర్లు నేర రిపోర్ట్లను విడుదల చేసారు ..రాచకొండ , హైదరాబాద్ లో గత ఏడాదితో పోలిస్తే ఈ సారి నేరాల శాతం తగ్గింది...