తాగి బండి నడిపేవారు ఎంతటివారైనా వదిలే ప్రసక్తే లేదు ...సీపీ సజ్జనార్
By: Sankar Tue, 29 Dec 2020 4:26 PM
మద్యం తాగి వాహనాలు నడిపేవాళ్లు ఉగ్రవాదులతో సమానమని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే పదేళ్ల జైలు శిక్ష పడేలా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తాగి బండి నడిపేవాళ్లను ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
కాగా సోమవారం ఒక్కరోజే నగరంలో 420 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో పట్టుబడ్డారు. ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే నగరంలో కొత్త సంవత్సరం వేడుకలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, ఏఆర్తో పాటు ఎస్వోటీ పోలీసులు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పాల్గొంటారని తెలిపారు.
కాగా ఇటీవల డ్రంక్ డ్రైవ్ కేసుల మీద హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక ద్రుష్టి పెట్టారు...ఇటీవలే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ దొరికితే అమలు అయ్యే శిక్షలని ప్రకటించారు..డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మొదటి సారి పట్టుబడితే రూ.10వేల జరిమానా, 6 నెలల జైలు శిక్ష, 3 నెలలు లైసెన్స్ రద్దు చేస్తామని వెల్లడించారు. ఇక రెండోసారి పట్టుబడితే రూ.15 వేల ఫైన్, రెండేళ్ల జైలు శిక్ష, శాశ్వతంగా లైసెన్స్ రద్దు చేస్తామని స్పష్టం చేశారు.