ధరణి దేశంలోనే ఒక విప్లవాత్మక విధానం ...తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్
By: Sankar Tue, 03 Nov 2020 05:51 AM
రాష్ట్రంలో ధరణి శకం మొదలైంది. గతనెల 29న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లిలో సీఎం కేసీఆర్ ధరణిని ప్రారంభించగా, సోమవారంనుంచి రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు మొదలయ్యాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ తాసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు.
ధరణి పోర్టల్ ఆధారంగా గిఫ్ట్డీడ్ కింద చేసిన తొలి లావాదేవీ పత్రాలను లబ్ధిదారు మంచాల ప్రశాంతికి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భూముల అమ్మకాలు, గిఫ్ట్డీడ్, మరణించినవారి వారసులకు రిజిస్ట్రేషన్, ఫ్యామిలీ పార్టిషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఏకకాలంలో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరుగడం దేశంలోనే వినూత్న విధానమని ప్రశంసించారు. ధరణిద్వారా రిజిస్ట్రేషన్లకు మంచి స్పందన వస్తున్నదని పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10:30 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 946 మంది రిజిస్ట్రేషన్ కోసం స్టాంప్ డ్యూటీ చెల్లించారని, వారిలో 888 మంది స్లాట్బుక్ చేసుకున్నారని తెలిపారు.
మీ సేవ కేంద్రాల్లో స్లాట్ బుకింగ్ కోసం రూ.200 ఫీజుగా నిర్ణయించినట్టు వెల్లడించారు. స్మార్ట్ఫోన్ ద్వారా కూడా స్లాట్బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ సందర్భంగా బయోమెట్రిక్ సమస్యలు ఏర్పడితే ఐరిస్ ద్వారా ప్రక్రియ కొనసాగుతుందని ఆయన వివరించారు. సోమవారం తొలిరోజు పోర్టల్ ద్వారా రాష్ట్రంలో సుమారు 200 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. సాయంత్రం వరకు 1,585 స్లాట్లు బుక్కయ్యాయి.