నేర రాజకీయాలు
By: chandrasekar Sat, 25 July 2020 4:12 PM
క్రిమినల్ సిండికేట్లకు
రాజకీయ నాయకులతో, అధికారులతో గల తెరచాటు సంబంధాలను బయట పెట్టడానికి
పీవీ ప్రభుత్వం వోహ్రా కమిటీ రూపంలో ఒక ప్రయత్నం చేసింది. ప్రధాని పీవీ రాజకీయాలను
ప్రక్షాళన చేయలేకపోయినా తేనె తుట్టెను మాత్రం కదిలించారు. 1993
మార్చిలో ముంబయి సీరియల్ బాంబు పేలుళ్ళు జరిగాయి. ఈ సందర్భంగా మాఫియాకు రాజకీయ
నాయకులకు సంబంధాలున్నాయనే విషయమై గగ్గోలు పుట్టింది. దీంతో పీవీ ప్రభుత్వం 1993
జూలైలో నాటి హోం శాఖ కార్యదర్శి ఎన్.ఎన్. వోహ్రా నేతృత్వంలో ఒక కమిటీని
నియమించారు. క్రైం సిండికేట్లు మాఫియాతో సంబంధాలు పెట్టుకొని వాటిని కాపాడుతున్న
అధికారులు, రాజకీయ నాయకుల కార్యక్రమాలపై సమాచారం సేకరించడం ఈ
కమిటీ లక్ష్యం. అతి వేగంగా 1993 అక్టోబర్లో వోహ్రా కమిటీ కేంద్ర ప్రభుత్వానికి
నివేదికను సమర్పించింది.
ఈ కమిటీ నివేదికలోని
వివరాలు ముంబయి పేలుళ్ల కన్నా భయంకరంగా ఉన్నాయి. దీంతో బయట పెట్టలేక పోయారు.
ఇప్పటికీ అవినీతి, నేర రాజకీయాలపై చర్చకు ఈ కమిటీ నివేదిక కేంద్ర
బిందువుగా ఉంటున్నది. వోహ్రా కమిటీ వెల్లడించిన అంశాల ఆధారంగా దర్యాప్తు సాగించి
దోషులను శిక్షించాలని సుప్రీం కోర్టు 1997లో కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నివేదికలోని
కొన్ని అంశాలను న్యాయస్థానం ప్రస్తావించింది. నేర ముఠాలు, అధికారులు, నాయకులు
కుమ్మక్కయి సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నాయని వోహ్రా కమిటీ పేర్కొన్నది.
నగరాలలో రియల్ ఎస్టేట్ను
ఆసరాగా చేసుకుని నేరస్థ ముఠాలు చెలామణి అవుతున్నాయి. దేశవ్యాప్తంగా క్రిమినల్
గ్యాంగ్స్ ఏర్పడి పోలీసులు, అధికారులు, నాయకులతో సంబంధాలు నెలకొల్పుకున్నాయి. సాయుధ ముఠాలు, డ్రగ్
మాఫియా, స్మగ్లింగ్
గ్యాంగ్స్, ఆర్థిక నేరస్థులు దేశమంతా అల్లుకుపోయి అధికారులతో, నాయకులతో
సంబంధాలు పెట్టుకున్నారు. వ్యక్తిగత నేరాలను అరికట్టడానికి రూపొందించి మన చట్టాలు
ఈ నేర ముఠాలను అరికట్టలేక పోతున్నాయని కమిటీ నివేదికలోని సారాంశాన్ని సుప్రీం
కోర్టు వెల్లడించింది.