బయో సెక్యూర్ వాతావరణంలో క్రికెట్
By: chandrasekar Tue, 09 June 2020 4:12 PM
క్రికెట్ పునరుద్ధరణ దిశగా అడుగులు పడుతున్నాయి. కరోనా వైరస్ కారణంగా మూడు నెలలుగా నిలిచిపోయిన సిరీస్లు మళ్లీ ప్రారంభం కానున్నాయి. గతానికి భిన్నంగా పటిష్ట జాగ్రత్తలతో ఆటగాళ్ల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యంగా ఏర్పాట్లు జరుగబోతున్నాయి. వెస్టిండీస్తో మూడు టెస్టుల సిరీస్కు ఇంగ్లండ్ ఆతిధ్యం యివ్వనున్నాయి. వైరస్ వ్యాప్తి నిరోధానికి బయో సెక్యూర్ ఎన్విరాన్మెంట్ జీవ రక్షణకు అనుకూలమైన వాతావరణంలో మ్యాచ్లు నిర్వహించేందుకు ఈసీబీ సిద్ధమైంది. విండీస్ ఆటగాళ్లను చార్టెడ్ విమానాల్లో తీసుకురావడంతో మొదలుపెడితే మూడు వారాల క్వారంటైన్ కల్పించడం వరకు ప్రత్యేకమైన వాతావరణంలో సిరీస్ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
కోవిడ్ వైరస్ మహమ్మారి కారణంగా క్రికెట్ రూపురేఖలు మారబోతున్నాయి. ఇప్పటి వరకు మనం చూసిన ఆటకు ఇకపై మనం చూడబోతున్న దానికి చాలా వ్యత్యాసం ఉండబోతున్నది. వైరస్ ప్రవేశంతో సరికొత్త మార్పులతో క్రికెట్ మన ముందుకు రాబోతున్నది. కొవిడ్-19తో ఆర్థికంగా నష్టపోతున్నబోర్డును గాడిలో పడేసేందుకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డుమంచి ప్రణాళికతో ముందుకు వస్తున్నది. ఓవైపు వైరస్ వ్యాప్తి నిరోధించేందుకు బ్రిటన్ ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ వెస్టిండీస్, పాకిస్థాన్తో సిరీస్లు నిర్వహించేందుకు ఏర్పాట్లలో మునిగిపోయింది.
మూడు మ్యాచ్ల సిరీస్ కోసం సౌతాంప్టన్, మాంచెస్టర్ వేదికలు ఎంపిక చేసింది. ఇరు జట్ల మధ్య జూలై 8న తొలి టెస్టు మొదలవుతుంది. దీనికి సంబంధించిన వివరాలను ఈసీబీ ఈవెంట్స్ డైరెక్టర్ స్టీవ్ ఎల్వర్తీ మీడియాకు వివరించాడు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని నెలకొల్పుతారు. 25 మందితో కూడిన వెస్టిండీస్ బృందాన్ని చార్టెడ్ విమానాల్లో బ్రిటన్కు తీసుకొస్తారు. వీరంతా మంగళవారం ఇంగ్లండ్కు చేరుకుంటారు. బ్రిటన్ ఆరోగ్య నిబంధనలకు అనుగుణంగా సిరీస్ వేదికల్లో ఒకటైన మాంచెస్టర్ లో మూడు వారాల పాటు విండీస్ ఆటగాళ్లను క్వారంటైన్లో ఉంచుతారు.
బయో సెక్యూర్ ఎన్విరాన్మెంట్లోకి ప్రవేశించే ముందు ఆటగాళ్లందరికీ పూర్తి స్థాయి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. దీని ద్వారా సిరీస్ మొదలయ్యే నాటికి ఆటగాళ్లందరనీ కరోనా వైరస్ ప్రభావం నుంచి దూరంగా ఉంచుతారు. ఒకవేళ మ్యాచ్ సాగుతున్న సమయంలో ఎవరైనా పాజిటివ్ అని తేలితే వారిని నిబంధనలకు అనుగుణంగా ఐసోలేషన్కు పంపిస్తారు. అయితే సబ్స్టిట్యూట్ విషయంలో ఐసీసీ నుంచి పూర్తిస్థాయి మార్గదర్శకాలు రావాల్సి ఉంది.
మ్యాచ్ జరిగే సమయంలో 250 మంది కంటే ఎక్కువగా స్టేడియంలోకి ఎవరిని అనుమతించరు. అందరినీ పరీక్ష చేసిన తర్వాతే లోనికి ప్రవేశం కల్పిస్తారు. ఆటగాళ్లు 2 నెలలకు పైగా బయో బబుల్ ఎన్విరాన్మెంట్లో గడపాల్సి ఉంటుంది. బయటకు వెళ్లి లోనికి రావాలన్న కొద్ది సమయం మాత్రమే అవకాశమిస్తారు. లోపలికి వచ్చేటప్పుడు కచ్చితంగా డాక్టర్లు పరీక్షలు నిర్వహిస్తారు. మ్యాచ్లు జరిగే వేదికల దగ్గరే ఆటగాళ్ల కోసం వసతి సౌకర్యాలు కల్పిస్తారు. దీని ద్వారా ప్రయాణాలు చేసే అవసరం లేకుండా పోతుంది.
వెస్టిండీస్తో టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్ 55 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేసింది. వెస్టిండీస్, పాకిస్థాన్తో టెస్టు సిరీస్లకు తోడు ఐర్లాండ్, ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్ల ద్వారా ఈసీబీ రూ.3496 కోట్ల నష్టం నుంచి తప్పించుకోనుంది. వచ్చే నెలలో తన భార్య బిడ్డకు జన్మనిస్తే ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ వెస్టిండీస్తో తొలి టెస్టుకు దూరమయ్యే అవకాశముంది. ఒకవేళ రూట్ దూరమైతే బెన్ స్టోక్స్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వహించే చాన్స్ ఉన్నది.