జిహెచ్ఎంసి ఎన్నికలు ...పోలింగ్ శాతం పెరిగింది
By: Sankar Thu, 03 Dec 2020 11:23 AM
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అందరూ అనుకున్నట్టు గా పోలింగ్ శాతం తక్కువగా నమోదు కాలేదు. క్రితంసారి కంటే కాస్త ఎక్కువగానే నగర పౌరులు పోలింగ్లో పాల్గొన్నారు.
మంగళవారం 149 డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో 46.55 శాతం పోలింగ్ నమోదైనట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ బుధవారం వెల్లడించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల చరిత్రలోనే ఇది అత్యధికమని చెప్పారు. క్రితంసారి జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఈసారి 1.28 శాతం మంది ఎక్కువగా ఈ ఎన్నికల్లో ఓటు వేశారని తెలిపారు.
గత రెండు దశాబ్దాలలో జీహెచ్ఎంసీకి జరిగిన ఎన్నికల సరళిని పరిశీలిస్తే ప్రతిసారి పోలింగ్ శాతం పెరుగుతూ వస్తున్నదని పేర్కొన్నారు. తొలుత మందకొడిగా ఓటింగు మొదలైనప్పటికీ మధ్యాహ్నం నుంచి ఊపందుకున్నదని చెప్పారు. గ్రేటర్వ్యాప్తంగా 9,101 పోలింగు కేంద్రాల నుంచి వచ్చిన వివరాలను క్రోడీకరించి.. పొరపాట్లు జరుగకుండా పరిశీలించడంతో తుది వివరాలను ప్రకటించడంలో ఆలస్యం జరిగిందని అధికారులు తెలిపారు.