విశాఖలో మరో ప్రమాదం ..షిప్ యార్డ్ క్రేన్ కూలి పదకొండు మంది మృతి
By: Sankar Sat, 01 Aug 2020 3:51 PM
హిందూస్తాన్ షిప్ యార్డులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. క్రేన్ ద్వారా లోడింగ్ పనులు పరిశీలిస్తుండగా క్రేన్ కుప్పకూలిపోవడంతో పదకొండు మంది కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద ఘటనపై విచారిస్తున్నారు.షిప్యార్డులో ప్రమాదంపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరా తీశారు. క్షతగాత్రులకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని ఆర్డీవోకు ఫోన్ ద్వారా సూచించారు. హిందుస్తాన్ షిప్ యార్డ్ వద్దరక్షణ శాఖ ఉద్యోగులు సహాయ చర్యలు చేపట్టారు..
హిందుస్తాన్ షిప్ యార్డులో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. ప్రమాద ఘటన వివరాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తక్షణ చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్, విశాఖ నగర పోలీస్ కమిషనర్ను సీఎం జగన్ ఆదేశించారు.
గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ఆదేశాలు జారీచేశారు. ప్రమాదానికి గల కారణాలపై యాజమాన్యంతో చర్చించి వివరాలను సేకరించాలని సూచించారు. మరోవైపు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు కాకినాడ నుంచి విశాఖకు బయలుదేరారు. కాగా క్రేన్ ద్వారా లోడింగ్ పనులు పరిశీలిస్తుండగా క్రేన్ కుప్పకూలిపోవడంతో 11 మంది కార్మికులు మృతి చెందారు. కార్మికుల మృతిపై సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు