హేమంత్ కుటుంబానికి పూర్తి రక్షణ కల్పిస్తాము ..సీపీ సజ్జనార్ హామీ
By: Sankar Wed, 30 Sept 2020 5:57 PM
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హేమంత్ కుటుంబ సభ్యులకు పూర్తి భద్రత కల్పిస్తామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ హామీనిచ్చారు. హేమంత్ ఇంటివద్ద 24 గంటల భద్రత ఏర్పాటు చేయాలని చందానగర్ పోలీసులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఒక మహిళా కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్ను ఏర్పాటు చేయాలని చెప్పారు. తమకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలన్నహేమంత్ భార్య అవంతి విజ్ఞప్తి మేరకు సజ్జనార్ స్పందించారు. దీంతోపాటు హేమంత్ కేసు విచారణకు ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి లేఖ రాసినట్టు ఆయన తెలిపారు..
ఇదిలాఉండగా.. హేమంత్ పరువు హత్య కేసులో ప్రధాన నిందితులు యుగేంధర్ రెడ్డి, లక్ష్మారెడ్డిని పోలీసులు ఆరు రోజుల పాటు విచారించనున్నారు. కేసు విచారణలో భాగంగా అవంతిక తండ్రి లక్ష్మారెడ్డి, యుగేందర్ రెడ్డిలను గచ్చిబౌలి పోలీసులు బుధవారం కస్టడీలోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులను గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు తరలించారు.
గోపన్ పల్లి వద్ద హేమంత్ కిడ్నాప్ స్థలం నుంచి సంగారెడ్డిలో హత్యా స్థలం వరకు నిందితులను తీసుకెళ్లి పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయనున్నారు. ప్రధాన కుట్రదారు లక్ష్మారెడ్డి, అమలు చేసింది యుగంధర్ రెడ్డి అని పోలీసులు నిర్ధారించారు. సుపారీ కిల్లింగ్లో ఇంకా ఎవరి హస్తం ఉందనే కోణంలో విచారిస్తున్నారు. కాగా, ఈ కేసులో ఇప్పటివరకు 21 మందిని పోలీసులు అరెస్టు చేయగా.. మరో నలుగురు పరారీలో ఉన్నారు.
కాగా ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు అవినతికా మేనమామ కిరాయి రౌడీల సహాయంతో అవంతిక భర్త అయిన హేమంత్ ను చంపిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే..దీనితో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరువు హత్యా మీద అనేక నిరసనలు వ్యక్తం అయ్యాయి..అవంతిక కూడా తన భర్త ప్రాణాలు తీసిన వారిని ఎవరిని వదిలేదు అని తెలిపింది..