73 రోజుల్లో కరోనా వ్యాక్సిన్ వ్యాఖ్యలు అవాస్తవం.. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా
By: Sankar Sun, 23 Aug 2020 5:55 PM
కరోనా నియంత్రణ వ్యాక్సిన్ కోవిషీల్డ్ లభ్యతపై మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం, ఊహాజనితమని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (సీఐఐ) తెలిపింది. ప్రస్తుతం టీకా తయారీ, భవిష్యత్తు వినియోగం కోసం నిల్వ చేయడానికి మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఆదివారం తెలిపింది. మరో 73 రోజుల్లో కోవిషీల్డ్ మార్కెట్లోకి వస్తుందని, భారతీయులకు ఈ వ్యాక్సిన్ ఉచితమంటూ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని పేర్కొంది.
కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ క్లినికల్ ట్రయల్స్ విజయవంతంపై నిర్ధారణ చేసుకున్న తర్వాత, బల్క్ తయారీకి సంబంధిత సంస్థ నుంచి అనుమతి లభించిన తర్వాత వాణిజ్యపరంగా ఉత్పత్తి చేస్తామని సీఐఐ తెలిపింది. ఇవన్నీ పలు దశల్లో ఉన్నట్లు చెప్పింది.
ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ట్రయల్స్ మూడో దశలో ఉన్నట్లు సీఐఐ పేర్కొంది. టీకా వల్ల చేకూరే రోగనిరోధకశక్తి, సమర్థతను నిర్ధారించుకున్న తర్వాత దాని ఉత్పత్తి గురించి అధికారికంగా వెల్లడిస్తామని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. అప్పటి వరకు టీకా లభ్యత గురించి మీడియాలో వచ్చే వార్తలను నమ్మవద్దని సూచించింది. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకాతో కలిసి కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్పై సీఐఐ పరిశోధనలు జరుపుతున్నది.